
వచ్చే నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ టూర్కు వెళ్లనున్న న్యూజిలాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక ఆ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులో ఈ పర్యటన సందర్భంగా చేరనున్నాడు. అలాగే సీనియర్ ప్లేయర్లు అయిన టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. ఇకపోతే 2014నుంచి ద్వైపాక్షిక సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భాగమైన కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే.. గత సంవత్సరం టీ20 ప్రపంచకప్ అనంతరం భారత పర్యటన తర్వాత తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడబోతుండడం విశేషం. వీరు ఐపీఎల్లో ఆడినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్లో టీ20లు గానీ వన్డేలు గానీ ఆడలేదు.
న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్లు అయిన వెస్టిండీస్ లాంటి జట్టుతో తలపడడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అంతర్జాతీయ క్యాలెండర్లో న్యూజిలాండ్ జట్టు 2022లో ప్రతి నెల వివిధ ఫార్మాట్లలో ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. ఇకపోతే ఇటీవలే ఐర్లాండ్తో ముగిసిన వైట్ బాల్ సిరీస్లో కివీస్ తమ కీలక సీనియర్ ఆటగాళ్లు లేకుండానే వన్డేలు, టీ20లలో ఐర్లాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. ఐర్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన మైఖేల్ బ్రేస్వెల్ వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ ఈ పర్యటనలో వెస్టిండీస్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడబోతుంది. ఆగస్టు 10న ఈ పర్యటన ప్రారంభమై.. 21న ముగుస్తుంది. టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని న్యూజిలాండ్ చూస్తుంది.
న్యూజిలాండ్ వన్డే మరియు టీ20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ