క్రికెట్ చరిత్రలో మరో సంచలనం. ఏ ఫార్మాట్ అయినా సరే బలమైన జట్లలో ఒకటిగా పేరొందిన న్యూజిల్యాండ్ను జింబాబ్వే కన్నా పసికూన జట్టు అయిన యూఏఈ ఓడించింది. ఈ రెండు జట్లు మూడు టీ20ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీసులో తొలి మ్యాచ్లో కివీస్ విజయం సాధించింది.
అయితే రెండో మ్యాచ్లో ఆ టీంకు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ టీం బౌలర్లలో ఆయన్ అఫ్జల్ ఖాన్ మూడు కీలక వికెట్లతో చెలరేగాడు. మిగతా బౌలర్లకు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు.

కివీస్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (63), చాడ్ బోస్ (21), జిమ్మీ నీషమ్ (21) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేదు. వరుసగా వికెట్లు కోల్పోయిన ఈ టీంను చివర్లో మార్క్ చాప్మన్, నీషమ్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కొంత ప్రతిఘటన చూపడంతో న్యూజిల్యాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనలో యూఏఈకి కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఆ టీం ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (0)ను డకౌట్ చేశాడు. అయితే మరో ఓపెనర్, ఆ టీం కెప్టెన్ మహమ్మద్ వసీం (29 బంతుల్లో 55) చెలరేగాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత వచ్చిన అరవింద్ (25) కూడా ఆకట్టుకున్నాడు.
చివర్లో ఆసిఫ్ ఖాన్ (29 బంతుల్లో 48 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతను తన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అతనికి బసిల్ హమీద్ (12 నాటౌట్) నుంచి సహకారం అందింది. దీంతో ఈ టీం కేవలం 15.4 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంతితో కివీస్ను కట్టడి చేసిన అఫ్జల్ ఖాన్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.