కివీస్ సూపర్ బ్యాటింగ్..
లక్ష్య ఛేదనలో యువ ఓపెనర్ ఫిన్ అలెన్ (57), డెవాన్ కాన్వే (38 నాటౌట్) న్యూజిల్యాండ్ జట్టుకు శుభారంభం అందించారు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరే మ్యాచ్ ముగించేస్తారా? అనుకుంటున్న తరుణంలో జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ మరోసారి తను ఎంత ఇంపార్టెంటో గుర్తుచేశాడు. ఫిన్ అలెన్ను పెవిలియన్ చేర్చాడు.
వర్షం అంతరాయం..
అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 104 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో వర్షం పడటంతో ఆట ఆగింది. ఒకవేళ అంత వరకే డీఎల్ విధానం ప్రకారం విజేతను ప్రకటించాల్సి వస్తే.. కచ్చితంగా విజయం కివీస్కే దక్కేది. ఎందుకంటే డీఎల్ఎస్ ప్రకారం చేయాల్సిన స్కోరు కన్నా కివీస్ జట్టు 50 పరుగులు అదనంగా చేసింది.
టాపార్డర్ విఫలం..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఆరంభంలోనే శిఖర్ ధావన్ (28), శుభ్మన్ గిల్ (13), సూర్యకుమార్ యాదవ్ (6), రిషభ్ పంత్ (10) ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యారు. వీళ్లందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టడంతో భారత జట్టు 170 పరుగలకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న అయ్యర్, సుందర్
ఇలాంటి సమయంలో శ్రేయాస్ అయ్యర్ (49) మరోసారి తన విలువను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (12), దీపక్ చాహర్ (12) ఏమాత్రం ప్రభావం చూపలేదు. అయితే వాషింగ్టన్ సుందర్ (51) ఒంటరి పోరాటంతో జట్టు స్కోరును 200 దాటించాడు. అతనికి యుజ్వేంద్ర చాహల్ (8), అర్షదీప్ సింగ్ (9) మంచి సహకారం అందించారు.