హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగే రెండో టెస్టుకి విండిస్ జట్టు కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగనుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్పై ఒక టెస్టు మ్యాచ్ వేటు వేసింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే మూడు ఓవర్లు తక్కువగా వేయడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
సస్పెన్షన్తో పాటు జాసన్ హోల్డర్ మ్యాచ్ ఫీజులో కూడా ఐసీసీ 60 శాతం కోత విధించింది. జట్టులోని ఆటగాళ్ల ఫీజులో కూడా 30 శాతం కోత విధించడం విశేషం. గత 12 నెలల కాలంలో హోల్డర్ సస్పెన్షన్కు గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్లో పాకిస్థాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో విండిస్ ఇదే తప్పిదానికి పాల్పడింది.
ఇదిలా ఉంటే కివీస్-విండిస్ జట్ల మధ్య శనివారం (డిసెంబర్ 9)న హామిల్టన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి సాధారణంగా ఓ ఓవర్ తక్కువగా వేస్తే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్లకి 10 శాతం కోత విధిస్తుంటారు.
అయితే ఇక్కడ మూడు ఓవర్లు కావడంతో ఐసీసీ కాస్త ఎక్కువగా జరిమానా విధించింది. తొలి టెస్టులో గ్రాండ్ హోమ్ (105), టామ్ బ్లన్డెల్ (107) సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండిస్ జట్టు ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.