
హామిల్టన్: న్యూజిలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం హామిల్టన్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 243 రన్స్ చేసింది. కివీస్ తరఫున తొలి టెస్టు ఆడిన యువ ఓపెనర్ విల్ యంగ్ (5) త్వరగానే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ (86), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (97) న్యూజిలాండ్ను ఆదుకున్నారు. రెండో వికెట్కు 154 పరుగులు జోడించిన తర్వాత లాథమ్ ఔట్ అయ్యాడు. విలియమ్సన్, రాస్ టేలర్ 31 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
అయితే ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు వెస్టిండీస్ పేసర్ కీమర్ రోచ్ తండ్రి మృతిచెందారు. ఈ విషయాన్ని విండీస్ టీమ్ మేనేజర్ రావల్ లూయిస్ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మ్యాచ్లో లాథమ్ వికెట్ను రోచ్ తీశాడు. వికెట్ తీసిన తర్వాత రోచ్ మోకాళ్లపై కూర్చొని తన తండ్రికి సంతాపం తెలిపాడు. మరోవైపు రోచ్ తండ్రి మృతికి సంతాపంగా ఇరుజట్ల క్రికెటర్లు చేతికి బ్లాక్ బ్యాండ్స్ కట్టుకుని బరిలోకి దిగారు.
ఈ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ తన ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనే మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తండ్రిని కోల్పోయిన కరేబియన్ క్రికెటర్ కీమర్ రోచ్ను మ్యాచ్ ప్రారంభానికి ముందు విలియమ్సన్ హత్తుకొని సంఘీభావం ప్రకటించాడు. తోటి క్రికెటర్ పట్ల కివీస్ కెప్టెన్ వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక కీమర్ రోచ్ త్వరలోనే స్వదేశానికి వెళతారన్నాడని విండీస్ టీమ్ మేనేజర్ రావల్ లూయిస్ తెలిపారు.
వర్షం, మైదానం చిత్తడిగా ఉండటంతో టాస్ రెండు గంటలు ఆలస్యం అయింది. ఔట్ ఫీల్డ్ మీద ఉన్నట్లుగానే పిచ్ మీద కూడా పూర్తిగా పచ్చిక ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. తడి, పచ్చికతో పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్ మీద విండీస్ పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు విలియమ్సన్ ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. 219 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 16 బౌండరీలు బాదాడు.