హైదరాబాద్: మోడ్రన్ డే దిగ్గజాల్లో ఒకడైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విలియమ్సన్ (148 బ్యాటింగ్) సెంచరీ సాధించాడు. విలియమ్సన్కు ఇది 17వ టెస్టు సెంచరీ కావడం విశేషం.
తద్వారా ఐదు వేల పరుగుల క్లబ్లో చేరాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగవంతంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. హామిల్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో 60 పరుగులకు చేరుకోగానే విలియమ్సన్ ఐదు వేల పరుగుల క్లబ్లో చేరాడు.
ఈ క్రమంలో ఆ దేశ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో రికార్డును విలియమ్సన్ సవరించాడు. గతంలో మార్టిన్ క్రో 117 ఇన్నింగ్స్ల ద్వారా 5వేల పరుగులు సాధించగా, విలియమ్సన్ 110 ఇన్నింగ్స్ల్లోనే ఐదువేల మార్కుని చేరుకున్నాడు. ఇదిలా ఉంటే మూడో టెస్టులో విలియమ్సన్ రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.

ఈ టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ నాలుగు వికెట్లు తీసుకోగా, వాగ్నర్ మూడు, గ్రాండ్ హోమ్మీ రెండు, సట్నర్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్కు ఓపెనర్లు లాథమ్ (50), రవల్ (88) మంచి ఓపెనింగ్ ఇచ్చారు.
జట్టు స్కోరు 83 పరుగుల వద్ద లాథమ్ తొలి వికెట్గా అవుటయ్యాడు. లాథమ్ (50) అర్ధసెంచరీ చేసిన తర్వాత మోర్నెల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి జోడీ 190 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాపై 7 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం విలియమ్సన్ 148, సట్నర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరొకవైపు స్వదేశంలో టాప్-3 ఆటగాళ్లు యాభైకి పైగా పరుగుల్ని సాధించడం న్యూజిలాండ్కు ఇదే తొలిసారి.