
హైదరాబాద్: పాకిస్తాన్తో మొదలైన ఐదు వన్డేల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ శుభారంభం చేసింది. శనివారం పాక్తో జరిగిన తొలి వన్డేలో కివీస్ 61 పరుగుల(డక్వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డేల్లో పాకిస్థాన్(9) వరుస విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది.
దీంతో ఐదు వన్డేల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 315 పరుగులు చేసింది. ఓపెనర్లు కొలిన్ మున్రో(58), మార్టిన్ గప్టిల్(48) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 83 పరుగులు జోడించారు.
మున్రో ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (115) సెంచరీ సాధించాడు. చివర్లో నికోల్స్ (50) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ 300 పైచిలుకు మైలురాయిని అందుకుంది. పాకిస్థాన్ బౌలర్లలో హసన్ అలీ(3/61)కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ పూర్తిగా సాగలేదు.
దీంతో పాక్ ఇన్నింగ్స్ను 30.1 ఓవర్లకు 228 పరుగుల లక్ష్యంగా నిర్దేశించారు. కివీస్ బౌలర్లు టిమ్ సౌథీ(3/22), ట్రెంట్ బౌల్ట్(2/35) ధాటికి పాకిస్థాన్ 30.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకార్ జమాన్ (82 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
ఈ మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న విలియయ్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య జనవరి 9న రెండో వన్డే జరుగనుంది.