న్యూజిలాండ్ గడ్డపై భారత మహిళల జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. తాజాగా కివీస్తో జరిగిన మూడో వన్డేలోనూ ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 0-3 తేడాతో మిథాలీసేన కోల్పోయింది. మూడో వన్డేలో, రెండో వన్డేలో టీమిండియా మహిళలు భారీ స్కోర్ సాధించినప్పటికీ బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 279 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (69*), ఓపెనర్లు మేఘన (61), షఫాలీ వర్మ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు మేఘన, షఫాలీ తొలి వికెట్కు 100 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ మేఘన 9 ఫోర్లు, 2 సిక్సులతో 41 బంతుల్లోనే 61 పరుగులతో చెలరేగింది.
మిగతా బ్యాటర్లలో కెప్టెన్ మిథాలీ రాజ్ 23, యాస్తిక భాటియా 19, హర్మన్ ప్రీత్ కౌర్ 13, స్నేహ రానా 11, తానియా భాటియా 8, గోస్వామి 8 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో హన్నా రోవ్, రోజ్మేరీ మెయిర్ రెండేసి వికెట్లు, అమేలి కేర్, డేవిన్, ఎఫ్ మాకే, సాటర్త్వైట్ తలో వికెట్ తీశారు.
అనంతరం 280 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అతిథ్య న్యూజిలాండ్ మహిళల జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో కివీస్ జట్టుకు ఇది రెండో అత్యుత్తమ లక్ష్య చేధన. ఆ జట్టు బ్యాటర్లలో అమేలి కేర్( 67), అమీ సాటర్త్వైట్ (59), లారెన్ డౌన్ (64*) హాఫ్ సెంచరీలతో రాణించారు. 35 పరుగులతో కేటీ మార్టిన్ చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడింది. 171 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడిన దశలో లారెన్ డౌన్ జట్టును ఆదుకుంది. కేటి మార్టిన్తో 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా ఫ్రాన్సిస్ మాకే (17*)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి 3 వికెట్లతో సత్తా చాటింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, స్నేహా రానా, ఏక్తా బిష్త్ తలో వికెట్ తీశారు. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన కివీస్ బ్యాటర్ లారెన్ డౌన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.