వెల్లింగ్టన్: ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్లోని వెస్ట్పాక్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ చెలరేగుతున్నారు. ఓపెనర్ కొలిన్ మున్రో (64; 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేసాడు. వరుస బౌండరీలు కొట్టి న్యూజిలాండ్ను లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. మరో ఆటగాడు టీమ్ సిఫెర్ట్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు.
బుమ్రాకు ఉచిత సలహా.. సంజయ్ మంజ్రేకర్పై నెటిజన్ల ఫైర్!!
166 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రోలు ఇన్నింగ్స్ను తడబడుతూనే ఆరంభించారు. ఠాకూర్, సైనీ వేసిన తొలి రెండు ఓవర్లలో కొంత తడబడిన ఓపెనర్లు.. బుమ్రా వేసిన మూడో ఓవర్లో పూర్తిగా తడబడి మూడు పరుగులే చేసారు. ఇక సైనీ వేసిన నాలుగో ఓవర్లో సిక్స్ మున్రో సిక్స్ బాది స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేసాడు. అయితే ఐదో ఓవర్లో గప్తిల్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడిన గప్తిల్ కీపర్ చేతికి చిక్కాడు.
గప్తిల్ పెవిలియన్ అనంతరం మున్రో చెలరేగాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 6,4,4 బాది 16 పరుగులు పిండుకున్నాడు. ఆపై కూడా మున్రో భారత బౌలర్లపై చెలరేగాడు. మరోవైపు సిఫెర్ట్ అతనికి మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో మున్రో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. దూబే వేసిన 12వ ఓవర్లో మున్రో రెండో పరుగుకు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో బ్రూస్ డకౌట్ అయ్యాడు. దీంతో 97 పరుగులకు కివీస్ మూడు వికెట్లు కోల్పోయింది.
సిఫెర్ట్, టేలర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో సిఫెర్ట్ (38), టేలర్ (15) ఉన్నారు. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే ఇంకా 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి.
అంతకుముందు టీమిండియా 166 పరుగులు చేసింది. భారత జట్టులో మనీష్ పాండే(50 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు) మెరవగా.. కేఎల్ రాహుల్ (39; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శార్దూల్ ఠాకూర్ (20;15 బంతుల్లో 2 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించారు. చివర్లో నవదీప్ సైనీ (11 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించాడు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ మూడు వికెట్లు సాధించగా.. బెన్నెట్ రెండు వికెట్లు తీశాడు.