శాంసన్ విఫలం:
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, సంజూ శాంసన్లు ఆరంభించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే శాంసన్ (8) భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. కుగ్లీన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని సిక్స్ కొట్టిన శాంసన్.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐదేళ్ల తర్వాత శాంసన్కు వచ్చిన రెండో అవకాశం ఇది. దీన్ని కూడా వృథా చేసుకున్నాడు.
సోధీ మాయ:
కెప్టెన్ విరాట్ కోహ్లీ (11)సైతం నిరాశపరిచాడు. కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. 9 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ.. బెన్నెట్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ నిరాశపరిచాడు. 7 బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన అయ్యర్.. ఇష్ సోధీ బౌలింగ్లో సీఫెర్ట్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో టీమిండియా 52 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న పాండే:
ఈ సమయంలో శివమ్ దూబే (12), మనీష్ పాండేల జోడి కాసేపు ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ నాల్గో వికెట్కు 23 పరుగులు జత చేసిన తర్వాత దూబే ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ మూడు బంతులాడి డకౌట్గా నిష్క్రమించాడు. శార్దూల్ ఠాకూర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాండేతో కలిసి 43 పరుగుల్ని జత చేశాడు. దాంతో టీమిండియా తేరుకుంది. చివర్లో పాండేతో పటు సైనీ (11 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా 165 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ మూడు వికెట్లు సాధించగా, బెన్నెట్ రెండు వికెట్లు తీశాడు. సౌతీ, కుగ్లీన్, సాంట్నర్లకు తలో వికెట్ దక్కింది.