వెల్లింగ్టన్: ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్లోని వెస్ట్పాక్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ బౌలర్లు విజృంబిస్తున్నారు. టీమిండియా ఆరంభంలోనే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 12 ఓవర్లు ముగియకుండానే సంజూ శాంసన్ (8), విరాట్ కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (1),లోకేష్ రాహుల్ (39), శివమ్ దూబే (12), వాషింగ్టన్ సుందర్ (0) వికెట్లను చేజార్చుకుంది. కివీస్ బౌలర్ ఇష్ సోధి మూడు వికెట్లతో భారత బ్యాట్స్మన్ను బెంబేలెత్తించాడు.
వికెట్ తీసిన ఆనందం.. మైదానంలో గొంగళి పురుగు సెలబ్రేషన్స్ (వీడియో)
రోహిత్ శర్మ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఐదు బంతులే ఆడి 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిష్క్రమించాడు. కుగ్లీన్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని సిక్స్ కొట్టిన శాంసన్.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐదేళ్ల తర్వాత శాంసన్కు వచ్చిన రెండో అవకాశం ఇది. దీన్ని కూడా వృథా చేసుకున్నాడు. శ్రీలంక సిరీస్లో తొలి బంతికి సిక్స్ కొట్టిన శాంసన్.. రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోయిన విషయం తెలిసిందే.
రెండో వికెట్గా కోహ్లీ ఔటయ్యాడు. శాంసన్ ఔటైన తర్వాత వచ్చిన కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. 9 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ.. బెన్నెట్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అయ్యర్ కూడా నిరాశపరిచాడు. 7 బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన అయ్యర్.. ఇష్ సోధీ బౌలింగ్లో సీఫెర్ట్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో టీమిండియా 52 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది.
ఆపై రాహుల్ కొన్ని మంచి షాట్లు ఆడినా.. సోధి బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆపై వెంటవెంటనే దూబే, సుందర్ కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మనీష్ పాండే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ అతనికి సహకారం అందిస్తున్నాడు. క్రీజులో పాండే (18), ఠాకూర్ (10) పరుగులతో ఉన్నారు. టీమిండియా 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.