రోహిత్ కూడా రాణిస్తే
హ్యాట్రిక్ విజయంతో సిరీస్ను ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న భారత్ తమ తుది జట్టులో మార్పులు చేయకపోవచ్చు. బ్యాటింగ్లో భారత్కు పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. ఓపెనర్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. గత రెండు మ్యాచ్ల్లో విఫలమయిన హిట్మ్యాన్ బ్యాట్ ఝలిపిస్తే టీమిండియాకు తిరుగుండదు. బ్యాటింగ్ ఆర్డర్లో స్థానంతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న లోకేశ్ రాహుల్ అదే జోరు కొనసాగించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.
అయ్యర్ను అడ్డుకునేనా?
కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కూడా ఎలాంటి ఆందోళన లేదు. ఇక శ్రేయాస్ అయ్యర్ నిలకడైన ఆటతీరుతో టీమ్ మేనేజ్మెంట్ నిశ్చింతగా ఉంది. టీమ్లో నాలుగో స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్న అయ్యర్ మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. శివం దూబే, మనీశ్ పాండే కూడా విజృంభిస్తే భారీ స్కోరు ఖాయమే. పాండే, జడేజా,కోహ్లీ ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తున్నారు.
శార్దుల్ బదులుగా సైనీ?
భారత్ బౌలింగ్లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. భారీగా పరుగులు ఇస్తున్న పేసర్ శార్దుల్ ఠాకూర్కు బదులుగా నవదీప్ సైనీకి చోటు ఇవ్వవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు బౌలింగ్ భారం మోయనున్నారు. ఎప్పటిలాగే యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లలో ఒకరికే చాన్స్ రానుంది. హామిల్టన్ మైదానం పెద్దది కావడంతో చాహల్ను కాదని కుల్దీప్కు చాన్స్ ఇస్తారో లేదో చూడాలి. అయితే విన్నింగ్ కాంబినేషన్ను మార్చడానికి ఇష్టపడని కోహ్లీ తుది జట్టులో మార్పులు చేస్తాడా లేదా అనేది అనుమానమే.
ఆదుకునేది ఎవరు
బౌలింగ్లో కివీస్కు పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. బ్యాటింగ్లోనే ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్, టేలర్ జట్టు బ్యాటింగ్ భారం మోయాల్సి ఉంది. ఈ సిరీస్లో ఆల్రౌండర్గా కాకుండా పూర్తి స్థాయి బ్యాట్స్మన్గా నాలుగో స్థానంలో ఆడిన గ్రాండ్హోమ్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతని నుంచి జట్టు ఓ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. సాన్ట్నర్, సోధి, సౌతీ, బెన్నెట్ బౌలింగ్ విభాగంలో మరింత రాణించాల్సి ఉంది.
పిచ్, వాతావరణం :
సెడాన్ పార్క్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. గత ఐదు టీ20 మ్యాచ్లలో మూడు సార్లు జట్లు 190కి పైగా స్కోర్లు చేశాయి. ఏడాది క్రితం ఇక్కడే జరిగిన మ్యాచ్లో కివీస్ 212 పరుగులు చేసి కూడా కేవలం 4 పరుగులతోనే భారత్పై గెలిచింది. అయితే హామిల్టన్ పిచ్పై చక్కటి రికార్డు ఉండటం న్యూజిలాండ్కు కలిసొచ్చే అంశం. గతంలో ఇక్కడ 9 మ్యాచ్లు ఆడిన కివీస్.. ఏడింట విజయం సాధించింది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), అయ్యర్, పాండే, దూబే, జడేజా, శార్దూల్/సైనీ, చాహల్/కుల్దీప్, షమీ, బుమ్రా.
న్యూజిలాండ్: గప్టిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), గ్రాండ్హోమ్, టేలర్, సైఫెర్ట్, శాంట్నర్/డారిల్ మిషెల్, సోధి, సౌథీ, టిక్నర్/కుగ్లీన్, బెనెట్.