సూపర్ ఓవర్లో విజయం:
మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (1,1,6,4,1,4) 17 పరుగులు చేసింది. భారత్ తరఫున బుమ్రా సూపర్ ఓవర్ వేసాడు. కేన్ విలియమ్సన్ (11), మార్టిన్ గప్తిల్ (5) పరుగులు చేసారు. ఒక పరుగు బైస్ రూపంలో వచ్చింది. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ (15) భారీ సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా 20 రన్స్ చేసి గెలుపొందింది. లోకేష్ రాహుల్ 5 పరుగులు చేసాడు. కివీస్ తరఫున సౌథీ బౌలింగ్ చేసాడు.
టీ20 చరిత్రలో కొత్త రికార్డు:
ఈ విజయంతో టీమిండియా టీ20 చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. సూపర్ ఓవర్లో ఛేజింగ్ చేస్తూ వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు వెస్టిండీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 2012లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ సూపర్ ఓవర్ ఛేజింగ్లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.
సౌతీ ఐదు సార్లు సూపర్ ఓవర్:
ఇప్పటివరకు టీ20ల్లో ఆరు సార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడు సార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరు సార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఇక న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదు సార్లు సూపర్ ఓవర్ వేయగా.. నాలుగు సార్లు ఓడిపోవడం గమనార్హం.
బుమ్రా మూడు సార్లు సూపర్ ఓవర్:
ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా మూడు సార్లు సూపర్ ఓవర్ వేయగా.. మూడుసార్లూ అతని జట్టునే విజయం సాధించింది. ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్తో మ్యాచ్లో (4 పరుగులు).. 2019లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో (8 పరుగులు) బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు.
రోహిత్ @ 10వేలు:
ఓపెనర్గా (అన్ని ఫార్మాట్లలో కలిపి) 10వేల అంతర్జాతీయ పరుగుల క్లబ్లో రోహిత్ చేరాడు. మూడో టీ20లో 48 రన్స్ చేసినప్పుడు అతడు ఈ మార్క్కు చేరాడు. 219 ఇన్నింగ్స్ల్లో ఈ పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్, సెహ్వాగ్, గవాస్కర్ సరసన రోహిత్ చేరాడు. పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్మన్ కూడా రోహితే.