
హైదరాబాద్: ముక్కోణపు సిరిస్లో భాగంగా హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ అనూహ్యంగా గెలుపొందినప్పటికీ గత మ్యాచ్ ఫలితాల కారణంగా న్యూజిలాండ్ ఫైనల్ చేరడం విశేషం.
ఈ సిరిస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టుని ఇయాన్ మోర్గాన్ (80 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
మరో బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్(53) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ చివరి వరకు పోరాడింది. చివరి ఓవర్లో తడబడి ఓటమి పాలైంది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (47), కొలిన్ మున్రో (57) చక్కటి శుభరంభాన్నిచ్చారు. ముఖ్యంగా సిక్సర్లతో చెలరేగిన మున్రో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఏడు సిక్సర్లు బాదిన మున్రోను అదిల్ రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ త్వరగానే పెవిలియన్కు చేరినప్పటికీ, మరో ఎండ్లో మార్టిన్ గప్టిల్ రాణించడంతో 16.3వ ఓవర్లో 164 పరుగులు చేసింది. 21 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో గుప్టిల్, రాస్ టేలర్ ఔట్ కావడంతో కివిస్కు కష్టాలు మొదలయ్యాయి.