బౌలింగే ప్రధానం బలం..
నిజానికి న్యూజిలాండ్ జట్టుకు బౌలింగ్ ప్రధాన బలం. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, శాంట్నర్ల బౌలింగ్ ముందు భారత బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. మ్యాచ్ తమ చేతుల్లో నుంచి జారిపోయిందనుకున్న ప్రతీసారీ బ్లాక్ క్యాప్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఒత్తిడిలో పడిన ప్రతీసారీ వికెట్లను సాధిస్తూ వచ్చారు. ఫలితంగా కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని సైతం అందుకోలేక చతికిల పడింది భారత జట్టు. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు మ్యాట్ హెన్రీ. టాప్ ఆర్డర్ టాప్ లేపేశాడు. ఓపెనర్లు కొలిన్ మున్రో, మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ వంటి బ్యాట్స్మెన్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. వారిలో నిలకడ లోపించింది. బ్యాట్స్మెన్లు కుదురుగా ఆడట్లేదు. ఫలితంగా- తోటి జట్ల తరహాలో ఎదురుదాడి చేయలేకపోతోంది. భారీ స్కోర్లను నమోదు చేయలేకపోతోంది.
ఇంగ్లండ్ పరిస్థితి భిన్నం..
ఇంగ్లండ్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనపర్చుతోంది ఈ టోర్నమెంట్లో. పాకిస్తాన్, భారత జట్ల చేతుల్లో ఓడిపోయినప్పటికీ.. చివరి వరుస మ్యాచుల్లో ఇంగ్లండ్ జట్టు గెలిచిన తీరు అద్భుతమేనే చెప్పుకోవచ్చు. లీగ్ దశలో టీమిండియా, రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఎలా ఆడిందో, ఎలాంటి ఆటతీరును కనపరిచిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఈ రెండు జట్ల బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లు. అరివీర భయంకరంగా చెలరేగిపోయి ఆడారు. బ్యాటింగ్, బౌలంగ్, ఫీల్డింగ్..ఇలా ఈ మూడు విభాగాల్లో ఆధిపత్యాన్ని కనపర్చుతోంది. తొలిసారిగా ప్రపంచకప్ను అందుకునే అర్హత ఇంగ్లండ్ జట్టుకు ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
వర్షం దెబ్బకొడుతుందా?
ఫైనల్ మ్యాచ్కు వేదికైన లండన్లో ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తోంటే.. వర్షం వచ్చేలా కనిపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. 11 గంటల తరువాత వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షం పడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. మధ్యాహ్నం తరువాత ఆకాశం నిర్మలంగా ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని లండన్ వాతావరణ శాఖ అధికారులు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, కనిష్ఠంగా 11 డిగ్రీల వరకు నమోదవుతోందని తెలిపారు.
వర్షం వల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే..
వర్షం వల్ల ఆదివారం నాటి మ్యాచ్ తుడిచి పెట్టుకుని పోతే- రిజర్వ్ డే ఎలాగూ ఉండనే ఉంది. సోమవారం మ్యాచ్ను కొనసాగిస్తారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు భారత జట్టుపై ఎలా చెలరేగిపోయారన్నది మనకు తెలుసు. అదే పరిస్థితిని ఇక్కడా పునరావృతం చేయాలని బ్లాక్ క్యాప్స్ ఆశిస్తున్నారు. టాస్ గెలిస్తే.. న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వర్షం పడితే రెండోసారి బ్యాటింగ్కు దిగిన జట్టు డక్వర్త్ లూయిస్ నిబంధనను ఎదుర్కోవాల్సి ఉన్నందున.. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గ చూపువచ్చు