మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్స్గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 32 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది. న్యూజిలాండ్ దేశానికి పురుషుల క్రికెట్ లేదా మహిళల క్రికెట్లో ఇదే మొదటి పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్. కివీస్ అమ్మాయిలకు ఇది రెండో ప్రపంచకప్. 2000 వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 158 పరుగులు చేసింది. అమేలియా కెర్ (43; 38 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్.బ్రూక్ హాలీడే (38; 28 బంతుల్లో, 3 ఫోర్లు), సుజీ బేట్స్ (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలాబా రెండు వికెట్లు, అయబోంగా ఖకా, ట్రయాన్, డిక్లెర్క్, సున్ లుజ్ తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ. 16 పరుగులకే జార్జియా (9) పెవిలియన్కు చేరింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెర్తో కలిసి సుజీ బేట్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించింది. వీరిద్దరు నిలకడగా ఆడటంతో పవర్ప్లేలో న్యూజిలాండ్ 43 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత సఫారీ బౌలర్లు చెలరేగి స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీశారు. కానీ బ్రూక్ హాలీడే సత్తాచాటడంతో కివీస్ మెరుగైన స్కోరు సాధించింది.

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్లకు 126 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ వోల్వార్ట్ (33; 27 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోర్. వోల్వార్ట్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ 20 స్కోరును దాటలేదు. ఒత్తిడికి చిత్తయ్యారు. అయితే దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. వోల్వర్ట్-తజ్మిన్ కలిసి తొలి వికెట్కు అర్ధశతక (51) భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వీరిద్దరు కలిసి పవర్ప్లేలో 47 పరుగులు జోడించారు.

అయితే తజ్మిన్ ఔటవ్వడంతో దక్షిణాఫ్రికా వికెట్ల పతనం ప్రారంభమైంది. ఏడో ఓవర్ నుంచి న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి సఫారీలపై పైచేయి సాధించారు. రోజ్మేరీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు, బ్రూక్ హాలీడే , కార్సన్ తలో వికెట్ తీశారు.