అనుభవం లేని దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్కు గట్టి షాక్ ఇచ్చింది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో అద్భుత ప్రదర్శనతో తిరిగి పోటీలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో కివీస్ను 211 పరుగులకు ఆలౌట్ చేసి 31 పరుగుల ఆధిక్యాన్ని సాధించుకుంది.
ఓవర్నైట్ స్కోరు 220/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే ఆలౌటైంది. ఇవాళ ఆటలో ఎనిమిది ఓవర్లలో 22 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. రౌన్ డి స్వార్ట్ (64; 156 బంతుల్లో) టాప్ స్కోరర్. బెడింగ్ హామ్ (39; 102 బంతుల్లో), షాన్ వాన్ బెర్గ్ (38; 89 బంతుల్లో) పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఒరోర్కే నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.రచిన్ రవీంద్ర మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్కు వచ్చిన న్యూజిలాండ్ 211 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఓవర్లోనే డెవన్ కాన్వే (0) వెనుదిరిగాడు. టామ్ లాథమ్ (40; 104 బంతుల్లో)తో కలిసి కేన్ విలియమ్సన్ (43; 108 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరు పెవిలియన్కు చేరారు. కానీ రచిన్ రవీంద్ర (29; 73 బంతుల్లో), విల్ యంగ్ (36; 73 బంతుల్లో) స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. దీంతో టీ విరామానికి కివీస్ 121/3తో మెరుగైన స్థితిలోనే నిలిచింది.
కానీ ఆఖరి సెషన్లో దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగారు. వరుసగా వికెట్లు తీసి ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే 10వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నైల్ వాగ్నర్ (33; 27 బంతుల్లో) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో సౌతాఫ్రికా భారీ ఆధిక్యాన్ని పొందలేకపోయింది. సఫారీ బౌలర్లలో డేన్ పీడ్ట్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. పాటర్సన్ మూడు వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లు న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో లేని విషయం తెలిసిందే.