హైదరాబాద్: పాకిస్తాన్ తమ దేశ క్రికెట్కు పునర్వైభవం కల్పించేందుకు కృషి చేస్తోన్న క్రమంలో.. న్యూజిలాండ్ నుంచి వచ్చిన వార్త షాక్కు గురిచేసింది. 15 ఏళ్ల తర్వాత తమ దేశంలో క్రికెట్ ఆడాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అభ్యర్థనను న్యూజిలాండ్ తోసిపుచ్చింది. కివీస్ జట్టు యూఏఈ వేదికగా పాక్తో టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్ ఆడనుంది. టెస్టులు, వన్డేలను యూఏఈలోనే ఆడండి, కానీ టీ20 మ్యాచ్లను మా దేశంలో ఆడండని న్యూజిలాండ్ బోర్డును పీసీబీ రిక్వెస్ట్ చేసింది. చివరిసారిగా 2003లో కివీస్ జట్టు పాక్లో పర్యటించడంతో.. ఆ జట్టు సానుకూలంగా స్పందిస్తుందని పాక్ భావించింది.
కానీ పాక్ ప్రతిపాదనను న్యూజిలాండ్ సున్నితంగా తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్లో పర్యటించడం సరికాదని భావిస్తున్నామని న్యూజిలాండ్ క్రికెట్ చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపారు. మా నిర్ణయంతో పాక్ నిరుత్సాహపడుతుందని తెలుసు. కానీ భద్రతా కారణాల వల్ల వెళ్లలేకపోతున్నామని ఆయన చెప్పారు. న్యూజిలాండ్ పాకిస్థాన్లో పర్యటిస్తే.. అంతర్జాతీయ క్రికెట్ను తిరిగి తమ దేశానికి రప్పించాలనే పాక్ ప్రయత్నాలకు ఊతం లభించేది.
2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుపై లాహోర్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత పాక్లో పర్యటించేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు. కొన్నాళ్ల క్రితం వెస్టిండీస్ పాక్లో టీ20 మ్యాచ్లు ఆడింది. వరల్డ్ ఎలెవన్ జట్టుతో టీ20 మ్యాచ్లు నిర్వహించారు. కానీ ఇప్పటికీ పెద్ద జట్లేవీ పాక్లో పర్యటించడానికి ఆసక్తి చూపడం లేదు. సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్లో భారత్ను ఇదే పాకిస్తాన్ జట్టుతో ఆడాలని నిర్వహక సంఘం సూచించింది.
ఈ షెడ్యూల్పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 19న భారత్ పాక్ల మధ్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న వన్డే పోరు జరగనుంది. ఇదిలా ఉంచితే న్యూజిలాండ్తో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్లు న్యూజిలాండ్ లోనే జరుగుతుండటంతో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన చేయనుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు జరగనున్న వివిధ టోర్నీల్లో న్యూజిలాండ్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్లతో తలపడనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.