
హైదరాబాద్: ఐసీసీ గురువారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకుల్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కోలిన్ మున్రో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. బుధవారం వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో మున్రో సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. 53 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్లతో సాయంతో 104 పరుగులు చేశాడు.
దీంతో టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా మున్రో ప్రపంచ రికార్డుని నమోదు చేశాడు. అంతేకాదు మున్రో చేసిన సెంచరీ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్తో కలిసి ఐదో స్ధానంలో నిలబెట్టింది. ఈ ప్రదర్శనే అతడిని టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచేలా చేసింది.
తొలిసారి తన కెరీర్లో అగ్రస్ధానంలో నిలిచిన మున్రో ఏకంగా ఒకేసారి 11 స్థానాలు ఎగబాకాడు. ఇక, న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోధీ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంకుని దక్కించుకోవడం విశేషం. ఇష్ సోధీ ఒకేసారి తొమ్మిది స్థానాలు ఎగబాకి అగ్రస్ధానంలో నిలిచాడు.
తద్వారా 2009, 2010 తర్వాత న్యూజిలాండ్కు చెందిన ఆటగాళ్లు టీ20 ర్యాంకింగ్స్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకముందు బ్రెండన్ మెకల్లమ్, డానియల్ వెటోరీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో్ నిలిచారు.
శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరమైన కోహ్లీ 776 పాయింట్లతో ప్రస్తుతం మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ మాత్రమే టాప్-10లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.