హైదరాబాద్: 'టీమిండియా దాడి చేస్తోంది' ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా న్యూజిలాండ్ పోలీసులు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా వరుస విజయాల జోరు చూసి న్యూజిలాండ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ పోలీసులు సరదాగా ఫేస్బుక్లో హెచ్చరిక జారీ చేశారు. "దేశంలో భారత జట్టు పర్యటిస్తోంది. అమాయక న్యూజిలాండ్ బృందంపై ఆ జట్టు నేపియర్, మౌంట్ మాంగనుయ్లో తీవ్రంగా దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చేతిలో క్రికెట్ బ్యాట్ లేదా బంతి ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి" అంటూ పోస్టు పెట్టారు.
ఈ ఫేస్బుక్ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్ పోలీసు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించడాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్తో పాటు మాజీ క్రికెటర్లు కొంతమంది టీమిండియా చిత్రంతో ఉన్న ఆ పోస్టును ట్వీట్ చేశారు.
కాగా, ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి రెండు వన్డేల్లో కోహ్లిసేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోను అదరగొడుతున్న టీమిండియా సోమవారం జరగనున్న మూడో వన్డేలోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.