
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021ను ఓటమితో ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. పాకిస్థాన్ చేతితో ఎదురైన పరాజయాన్ని మరిచి టోర్నీ ముందుకు సాగాలంటే తప్ప గెలవాల్సిన మ్యాచ్ కోసం సమాయత్తం అవుతోంది. టీమిండియాతో దుబాయ్ వేదికగా ఆదివారం (అక్టోబర్ 31) జరిగే మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు భారత్ సైతం పాకిస్థాన్ చేతిలో ఓడి.. కివీస్ పరిస్థితినే ఎదుర్కొంటుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్ కోసం కివీస్ బరిలోకి దిగే తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
టీ20 ప్రపంచకప్ 2021 టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ మెగా టోర్నీ దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్కు గాయం అయింది. మంగళవారం షార్జాలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కాలి బొటన వేలికి గాయం అయింది. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని సమాచారం తెలుస్తోంది. దీంతో అతడు ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్లో ఆడుతాడో లేదో సరైన సమాచారం మాత్రం లేదు. ఒకవేళ గుప్తిల్ దూరమయితే.. టిమ్ సీఫెర్ట్ ఓపెనింగ్ చేయనున్నాడు.
పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో ఒక్క కివీస్ ప్లేయర్ కూడా పరుగులు చేయలేదు. టిమ్ సీఫెర్ట్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ విఫలమయ్యారు. వీరందరూ ఫామ్ అందుకోవాలి కివీస్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇందులో ఒక్కరు చెలరేగినా కివీస్ భారీ స్కోర్ చేస్తుంది. మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలతో కూడా స్పిన్ విభాగం పటిష్టంగానే ఉంది. స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ టీమిండియాతో మ్యాచ్కే కాదు.. టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని కుడి కాలి చీలమండంలో తేలికపాటి ఫ్రాక్చర్ ఏర్పడడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆతడి స్థానంలో డారిల్ మిచెల్ ఆడనున్నాడు. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ లాంటి నాణ్యమైన బౌలర్లు కివీస్ సొంతం.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా):
మార్టిన్ గప్టిల్/ డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్ (కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టె), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్/టాడ్ ఆస్టిల్, టిమ్ సౌతీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్.
భారత తుది జట్టు (అంచనా):
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ/రవిచంద్రన్ అశ్విన్.