టీ20 వరల్డ్ కప్-2024లో న్యూజిలాండ్ రికార్డు విజయంతో బోణీ కొట్టింది. ట్రిండాడ్ వేదికగా ఉగాండతో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ నామమాత్రపు మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో సత్తాచాటింది. మొదట బంతితో, తర్వాత బ్యాటుతో రికార్డులు సృష్టించింది.
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి మొదట ఉగాండ 18.4 ఓవర్లలో 40 పరుగులకు ఆలౌటైంది. కెన్నెత్ వైస్వా (11; 18 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. సౌథి (3/4) మూడు, బౌల్ట్ (2/7) శాంట్నర్ (2/8), రచిన్ రవీంద్ర (2/9) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. బంతితో మెరిసిన న్యూజిలాండ్ ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించింది.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడిచేసిన మూడో జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో వెస్టిండీస్, శ్రీలంక తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 2024లో ఉగాండను విండీస్ 39 పరుగులకు, 2014లో నెదర్లాండ్స్ను లంక 39 పరుగులకు ఆలౌట్ చేసింది. కాగా, అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది.
ఈ క్రమంలో కివీస్ మరికొన్ని రికార్డులు బద్దలుకొట్టింది. టీ20 వరల్డ్ కప్లో బంతుల పరంగా అత్యంత వేగంగా లక్ష్యాన్ని సాధించిన మూడో జట్టుగా న్యూజిలాండ్ రికార్డు సృష్టించింది. 88 బంతులు మిగిలుండగానే టార్గెట్ను ఛేదించింది. ఈ రికార్డు జాబితాలో కివీస్ కంటే ముందు ఇంగ్లండ్ (101 బంతులు, ఒమన్పై-2024), శ్రీలంక (90 బంతులు, నెదర్లాండ్స్పై- 2014) ఉన్నాయి. ఇక టీ20ల్లో ఓవరాల్గా బంతుల పరంగా న్యూజిలాండ్కు ఇదే అత్యంత భారీ విజయం. అంతకుముందు 2007లో కెన్యాపై 74 బంతులు మిగిలుండగానే గెలిచిన రికార్డు అత్యుత్తమంగా ఉండేది.