
హైదరాబాద్: మౌంట్ మాంగునుయ్ వేదికగా న్యూజలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే ఓ అభిమానికి కాసుల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొట్టిన భారీ షాట్ను క్యాచ్ పట్టిన ఓ కివీస్ అభిమాని రూ. 24 లక్షలు(50 వేల డాలర్లు) గెలుచుకున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్ మెన్లు శాంట్నర్ (52 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), గుప్టిల్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు), గ్రాండ్హోమీ (38) రాణించగా మిగతా వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు.
ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కివీస్ ఇన్నింగ్స్లో నలుగురు రనౌటవడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, అలీ, స్టోక్స్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో భాగంగా కివీస్ బౌలర్ టిమ్ సౌతీ వేసిన 36 ఓవర్లో ఒక డెలివరీని స్టోక్స్ ఫైన్ లెగ్ మీదుగా బౌండరీని దాటించాడు.
ఈ క్రమంలో బౌండరీ అవతల మైదానంలో ఉన్న కివీస్ అభిమాని ఆ క్యాచ్ను ఒంటిచేత్తో పట్టుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో న్యూజిలాండ్ అభిమానులు ఎవరైనా క్యాచ్లు అందుకుంటే ఆ క్యాచ్కు 50 వేల డాలర్ల ప్రైజ్మనీని ప్రకటించారు.
ఈ ప్రైజ్మనీని స్థానిక శీతల పానీయ సంస్థ అందజేయనుంది. ఇదిలా ఉంటే స్వదేశంలో న్యూజిలాండ్ ఆడుతోన్న సిరిస్ల్లో అభిమానులు క్యాచ్లు అందుకుని భారీ మొత్తాన్ని గెలుచుకోవడం నాలుగోసారి. ఇంగ్లాండ్తో సిరిస్కు ముందు జరిగిన ముక్కోణపు టీ20 సిరిస్లో మిచెల్ గ్రిమ్ స్టోన్ అనే స్టూడెంట్ రాస్ టేలర్ సిక్సుని క్యాచ్ పట్టాడు.
కాగా, ఈ మ్యాచ్లో 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 37.5 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీంతో రెండో వన్డేలో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే శనివారం (మార్చి 3)న వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుంది.