ఐసీసీ తన నిబంధనలను మార్చుకోవాలి అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ సూచించారు. లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి 15 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించారు.
బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడంపై ఐసీసీని మాజీలు తప్పుపడుతున్నారు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ వంటి వారు కూడా మరో సూపర్ ఓవర్ ఆడించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ ఐసీసీకి ప్రతిపాదనను తీసుకొచ్చాడు.
'ప్రపంచకప్ వంటి మెగాటోర్నీ ఫైనల్ మ్యాచ్లో విజేతను బౌండరీల ఆధారంగా ప్రకటించడం సరైంది కాదు. ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై అయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించండి. ఏడు వారాలుగా ప్రపంచకప్ కోసం మా ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్లో ఇలా ఓడిపోవడం బాధగా ఉంది. ఐసీసీ తన నిబంధనలను మార్చుకోవాలి' అని స్టీడ్ పేర్కొన్నారు.
ఇంతకుముందు న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ క్రేగ్ మెక్మిల్లన్ మాట్లాడుతూ... 'ఇక ఫలితాన్ని ఇప్పుడు మార్చలేం. ఫైనల్స్, సూపర్ ఓవర్లో రెండు జట్లూ సమాన స్కోర్లు సాధించిన తర్వాత ఒక్కరినే విజేతగా ప్రకటించడం సమర్థించలేము. రెండు జట్లను విజేతగా ప్రకటించడమే సరైన నిర్ణయం. ఫలితం పట్ల నిరాశ చెందినా.. అవి ఆటలోని నియమాలు' అని పేర్కొన్నారు.