
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో విలియమ్సన్ 500 పరుగుల మార్కును అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ప్రపంచకప్-2019లో ఐదు వందలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (647), డేవిడ్ వార్నర్ (638), షకీబుల్ హసన్ (606), అరోన్ ఫించ్ (507)లు ఉన్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు ఒక ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విలియమ్సన్ (548) గుర్తింపు సాధించాడు. 2015ప్రపంచకప్లో మార్టిన్ గప్టిల్ 547 పరుగులు సాధించాడు. ఈ మ్యాచులో గప్టిల్ను విలియమ్సన్ అధిగమించి తొలి స్థానంలోకి వచ్చాడు. ఇక ప్రపంచకప్లో ఐదు వందల పరుగులు చేసిన తొలి కివీస్ కెప్టెన్గా విలియమ్సన్ ఘనత సాధించాడు. ఒక ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో విలియమ్సన్, గప్టిల్ తర్వాత స్కాట్ స్టైరిస్ (2007 వరల్డ్కప్-499 పరుగులు), మార్టిన్ క్రో(1992 వరల్డ్కప్, 456 పరుగులు), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2007 వరల్డ్కప్-353 పరుగులు)లు ఉన్నారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్కు ఆదిలోనే షాక్ తగికింది. కేవలం ఒక్క పరుగు స్కోరుకే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (1) బుమ్రా బౌలింగ్లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్, కెప్టెన్ కేన్ విలియమ్సన్లు జట్టును ఆదుకున్నారు. ఈ జోడి అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం జడేజా టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. హెన్రీ నికోల్స్ (28; 51 బంతుల్లో 2×4)ను జడేజా క్లీన్ బోల్డ్ చేసాడు.
అనంతరం విలియమ్సన్, రాస్ టేలర్ జోడి సమయోచితంగా ఆడి మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ సమయంలో చాహల్ వేసిన 35.2వ బంతికి విలియమ్సన్ (67; 95 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. ఒకవైపు ఓవర్లు పూర్తవుతున్నా.. కివీస్ బ్యాట్స్మన్ స్వేచ్ఛగా పరుగులు తీయలేకపోతున్నారు. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్ (31), జేమ్స్ నీషమ్ (4) లు ఉన్నారు. 38 ఓవర్లకు న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.