హైదరాబాద్: ముంబై వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్హోమ్ అస్వస్థతకు గురయ్యాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో రెండు బంతులు వేసిన అనంతరం గ్రాండ్ హోమ్ వాంతి చేసుకున్నాడు. తన రెండు చేతులను మోకాళ్లపై పెట్టుకొని బాధతో వాంతులు చేసుకున్నాడు.
ఎండ వేడిమిని తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిజియో రాకతో అతను కొంత వరకు స్థిమితపడ్డాడు. అనంతరం ఆ ఓవర్ను అతను పూర్తి చేసి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన ఓ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్స్కోంబ్ ఏకంగా నాలుగున్నర కిలోల బరువు తగ్గిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తొలి వన్డేలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్కు 281 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు చేసిన భారత్ ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
16 పరుగుల వద్ద ఓపెన్ శిఖర్ ధావన్(9) వికెట్ను కోల్పోయిన భారత్, 29 పరుగుల వద్ద రోహిత్ శర్మ (20), 71 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (12) వికెట్లను కోల్పోయింది. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ... దినేశ్ కార్తీక్ (37)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఈ క్రమంలో తన కెరీర్లో 31వ సెంచరీ నమోదు చేసి విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో సచిన్ (49) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా చరిత్ర అరుదైన గుర్తింపు పొందాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని (25), హార్ధిక్ పాండ్యా (16), భువనేశ్వర్ కుమార్ (26) పరుగులు చేశారు.
చివరకు విరాట్ కోహ్లీ 125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీసుకోగా, టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్ ఓ వికెట్ తీసుకున్నాడు.