కొన్ని అనివార్య కారణాల వల్ల
వాస్తవానికి మహిళల జట్టు కోచ్ను సచిన్, గంగూలీ, లక్ష్మణ్తో కూడిన బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సీఏసీ ఇంటర్వ్యూలు నిర్వహించలేని పరిస్థితుల్లో కొత్త ప్యానెల్ను ఏర్పాటు చేసే ఆలోచనలో బోర్డు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ కోసం మాజీలు సునీల్ గవాస్కర్, కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శుభాంగి కులకర్ణి, శాంత రంగస్వామి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మహిళల క్రికెట్లో విభేదాలు
మరోవైపు భారత మహిళల క్రికెట్లో విభేదాలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేవు. రమేశ్ పోవారే కోచ్గా కావాలంటూ హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన బీసీసీఐ పాలకల కమిటీ(సీఓఏ)కు పంపిన ఈ-మెయిల్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఆదివారమే సీఓఏ ఛైర్మన్ వినోద్రాయ్ సమక్షంలో హర్మన్, మిథాలీ ఢిల్లీలో సమావేశమయ్యారు.
మిథాలీని తప్పించడంపై
ఈ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మిథాలీని తప్పించడం... ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇద్దరి మధ్య విభేదాలు పరిష్కారమయ్యాయని భావించిన వినోద్ రాయ్.. ఈ వివాదంలో బీసీసీఐ ఎవరి పక్షం వహించదని, కోచ్ ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతుందని చెప్పినట్లు సమాచారం.
బీసీసీఐకి ఈ-మెయిల్ పంపడంతో మళ్లీ చర్చనీయాంశం
మిథాలీ, పవార్ మధ్య చోటు చేసుకున్న వివాదం ఇక్కడితో సుఖాంతమవ్వాలి. కానీ, ఆ తర్వాతి రోజే హర్మన్ తమకు పొవారే కావాలని బీసీసీఐకి ఈ-మెయిల్ పంపడంతో మళ్లీ చర్చనీయాంశమైంది. వాస్తవానికి మిథాలీ-పొవార్ల మధ్య నెలకొన్న వివాదం భారత మహిళల జట్టు స్థాయిని దిగజార్చిందని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాదు, భారత మహిళల జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ క్రికెటర్ పట్ల రమేశ్ పొవార్ తీరుపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే రెండోసారి కోచ్ పదవికి అతను దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.