
హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆదివారం ఉదయం వరకు బ్రిజేష్ పటేల్ అధ్యక్షుడు పదవికి ముందు వరుసలో ఉన్నాడు. అయితే, కొన్ని గంటల్లోనే పరిస్థితులు గంగూలీకి అనుకూలంగా మారిపోయాయి. అనూహ్యాంగా తెరపైకి గంగూలీ పేరు వచ్చింది. ఒక్క రోజు తిరిగేసరికి బోర్డు అధ్యక్షుడిగా అతడి ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది.
గంగూలీతో పాటు కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు), మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్ సింగ్ ధూమల్ (ట్రెజరర్), బ్రిజేష్ పటేల్ (ఐపీఎల్ ఛైర్మన్), జయేష్ జార్జ్ (జాయింట్ సెక్రటరీ), ఖైరుల్ మజుందార్ (కౌన్సిలర్), ప్రభ్జ్యోత్ సింగ్ (కౌన్సిలర్) కూడా నామినేషన్లు వేశారు.
వీళ్లందరి ఎన్నిక కూడా ఏకగ్రీవమేనని తెలుస్తోంది. బీసీసీఐ ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి సైతం వీరి నామినేషన్లను ధృవీకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. "మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను" అని కామెంట్ పెట్టాడు.
ఈ ఫోటోలో బీసీసీఐ మాజీ బీసీసీఐ ఆధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. కాగా కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవి చేపట్టనుండగా, అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహిమ్ వర్మ బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, జయేష్ జార్జి జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.