ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై వివాదాలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల భారత జట్టుతో షేక్ హ్యాండ్ వివాదం తర్వాత తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు పాకిస్థాన్ జెర్సీల నాణ్యతపై కొత్త ఆరోపణలు వచ్చాయి. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అతీక్-ఉజ్-జమాన్ సోషల్ మీడియా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
'ప్లేయర్స్ తడిస్తే.. అవినీతి కారిపోతోంది'
అతీక్-ఉజ్-జమాన్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ.. పీసీబీ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆటగాళ్లకు చాలా తక్కువ నాణ్యత గల జెర్సీలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. టెండర్లు నిపుణులకు కాకుండా స్నేహితులకు ఇచ్చినప్పుడు ఇలాగే జరుగుతుందని పేర్కొన్నారు. మా ఆటగాళ్లు చెమటతో పూర్తిగా తడిసిపోతున్నారని.. అవినీతి చెమట కంటే ఎక్కువగా కనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు. భారత జట్టుతో సహా ఇతర జట్లు డ్రై-ఫిట్ కిట్లను ఆయన ఉదాహరణగా చూపించారు.

గెలిచినా బ్యాటింగ్పై ప్రశ్నలు
యూఏఈ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి పాకిస్థాన్ సూపర్-4కు చేరినప్పటికీ.. వారి బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాకిస్థాన్ జట్టు కేవలం 146/9 స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోతున్నారు. ఓపెనర్ సైమ్ ఆయుబ్ మూడు మ్యాచ్లలో డకౌట్ కావడం గమనార్హం. చివర్లో షాహీన్ షా అఫ్రిది కేవలం 14 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోరును కాస్త గౌరవప్రదంగా నిలబెట్టాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా జట్టు బ్యాటింగ్లో లోపాలను అంగీకరించారు. "మేము విజయం సాధించినా, ముఖ్యంగా మధ్య ఓవర్లలో బ్యాటింగ్ మెరుగుపరచుకోవాలి. సరిగ్గా ఆడి ఉంటే స్కోర్ 170-180 వరకు చేరేది" అని కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అన్నారు. ఈ జెర్సీ వివాదం, బ్యాటింగ్లోని బలహీనతలు సెప్టెంబర్ 21న భారత్తో జరగబోయే సూపర్-4 మ్యాచ్కు ముందు పాకిస్థాన్ జట్టుపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.