న్యూఢిల్లీ: మౌకా-మౌకా వాణిజ్య ప్రకటన ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్లపై చెరగని ముద్ర వేసింది. ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడే క్రికెట్ జట్ల మధ్య వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ యాడ్ కాన్సెప్ట్ సూపర్హిట్ అయింది. ప్రపంచకప్తో పాటుగా గుర్తొచ్చేంతలా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మౌకా-మౌకా యాడ్ మరోసారి సోషల్ మీడియా స్క్రీన్ను తాకింది. యథాతథంగా హిట్ అయింది. వైరల్లా మారింది. ఈ సారి ఈ యాడ్ కాన్సెప్ట్- ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడం. సెమీఫైనల్ మ్యాచ్లో జట్టు ఓడిపోయినప్పటికీ- ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని, ప్రతి భారతీయుడు జట్టు వెన్నంటే ఉన్నాడని చెప్పడమే ఈ యాడ్ కాన్సెప్ట్.
భారతీయునిగా గర్వపడుతున్నాం..
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల అభిమానుల మధ్య సరదాగా సంభాషణగా దీన్ని చిత్రీకరించారు. రెండు నిమిషాల 58 సెకెన్ల నిడివి ఉన్న వీడియో ఇది. ఆ ఇరు దేశాల అభిమానులు, తమ క్రికెట్ జట్ల జెర్సీలను ధరించి, కారులో కూర్చుని మాట్లాడుతుంటారు. ఈ సందర్భంగా వారి మధ్య టీమిండియా సెమీస్ పరాజయం ప్రస్తావనకు వస్తుంది. పాకిస్తాన్ జెర్సీ ధరించిన యువకుడు- కాస్త హేళనగా మాట్లాడతాడు. దీనిపై టీమిండియా అభిమాని గట్టిగా కౌంటర్ ఇస్తాడు. తాము ఛాంపియన్లలా టోర్నమెంట్ను ముగించామని, సెమీ ఫైనల్కు చేరడానికి ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడలేదని దిమ్మతిరిగే సమాధానం ఇస్తాడు. సెమీఫైనల్లో ఓడినప్పటికీ.. తాము (అభిమానులు) బాధపడట్లేదని, జట్టు సంతృప్తికరంగా ఆడిందని బదులిస్తాడు.
నిరాశ కలిగించిన ఓటమి..
ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొత్తం 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు..ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొద్దిసేపు ప్రతిఘటించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.