హైదరాబాద్: టీమిండియా కొత్త కోచ్ను ఈరోజే (జులై 10, సోమవార) ప్రకటిస్తామని క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) సభ్యులు లక్ష్మణ్, గంగూలీ ముంబైలోని ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడాడు. కొత్త కోచ్ను ఈ రోజే ప్రకటిస్తామని పేర్కొన్నాడు. కోచ్ పదవి కోసం బీసీసీఐ నిర్దేశించిన దరఖాస్తు గడువు ఆదివారంతో ముగిసింది. టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం 10 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఆరుగురికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోన్నారు.

రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, ఫిల్ సిమన్స్, లాల్ చంద్ రాజ్పుత్లను సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. మరోవైపు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న సెహ్వాగ్ కూడా ఇంటర్వ్యూ కోసం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చాడు.

అయితే ఈ ఇంటర్వ్యూలు ఎలా నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దరఖాస్తుు చేసుకున్న అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకాలేకపోతే వారిని స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాదు కోచ్ పదవికి ఫేవరెట్లంటూ ఎవరూ లేరని కూడా పేర్కొంది.