టీమిండియా క్రికెట్లో ఇప్పుడు మార్పుల పర్వం నడుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఇప్పటికే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పగా.. మిగిలిన ఫార్మాట్లలో కూడా సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు యువ ఆటగాళ్ల వైపు చూస్తున్నారు. 2026లో భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఉ్న ఏడుగురు మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.వైభవ్ సూర్యవంశీ
కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ సంవత్సరం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్లు నిండుతాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు నిండిన వారు సీనియర్ జట్టుకు ఆడవచ్చు. తన విస్పోటక బ్యాటింగ్ తో వైభవ్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు.

2. ఆయుష్ మాత్రే
అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్న ఆయుష్ మాత్రే.. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 660 పరుగులు, టీ20ల్లో 56.50 సగటుతో 565 పరుగులు సాధించి సెలెక్టర్ల రేసులో ముందున్నాడు.
3. ప్రియాన్ష్ ఆర్య
ప్రియాన్ష్ ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది వార్తల్లో నిలిచాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే 71 పరుగులతో ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు, ఐపీఎల్ 2026లో రాణిస్తే నేరుగా టీమిండియా జెర్సీని పొందే అవకాశం ఉంది.
4. ఆకిబ్ నబీ
జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ 29 ఏళ్ల పేసర్ కోసం ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ.8.40 కోట్లు ఖర్చు చేసింది. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 125 వికెట్లు తీసిన రికార్డు ఇతని సొంతం. టీమిండియా పేస్ దళానికి ఇతను మంచి అదనపు బలం కాగలడు.
5. అశుతోష్ శర్మ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు అశుతోష్. టీ20 ఫార్మాట్లో 1100కు పైగా పరుగులు చేసిన ఈ ఫినిషర్, వైట్ బాల్ క్రికెట్లో భారత జట్టుకు ఎంతో అవసరమైన ఆటగాడు.
6. విప్రజ్ నిగమ్
స్పిన్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగల సత్తా విప్రజ్ సొంతం. ఐపీఎల్ 2025లో 11 వికెట్లతో పాటు 179 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ అవసరం ఇతనితో తీరే అవకాశం ఉంది.
7. రసిక్ సలామ్
జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తున్న మరో పేసర్ రసిక్ సలామ్. టీ20ల్లో 42 మ్యాచ్ల్లో 50 వికెట్లు తీసి మంచి గణాంకాలను కలిగి ఉన్నాడు. ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్లో స్థిరంగా రాణిస్తున్న రసిక్, త్వరలోనే భారత సీనియర్ జట్టు నుంచి పిలుపు అందుకునే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తుండటంతో, 2026 సీజన్ ఈ యువ కిశోరాలకు స్వర్ణయుగంగా మారనుంది.