చిన్నస్వామి స్టేడియానికి గుడ్బై? ఆర్సీబీ కొత్త అడ్డా!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల నేపథ్యంలో ఆర్సీబీ జట్టుకు సరికొత్త హోమ్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. బెంగళూరు శివార్లలోని అనేకల్ ప్రాంతంలో రూ.943 కోట్ల భారీ బడ్జెట్తో సరికొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శనివారం(మే 23) పునాది రాయి పడింది. కర్ణాటక ప్రభుత్వ గృహనిర్మాణ శాఖ, కర్ణాటక హౌసింగ్ బోర్డ్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడుతున్నాయి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టేడియంగా రికార్డ్!
బెంగళూరు అర్బన్ జిల్లాలోన అనేకల్ తాలుకా, సూర్యనగర్ ఫేజ్-4లో ఈ కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఏకంగా 80,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో దీనిని ప్లాన్ చేశారు. గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం(1.32 లక్షల సామర్థ్యం) తర్వాత ఇది ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డు సృష్టించనుంది. కేవలం క్రికెట్కే పరిమితం కాకుండా దీనిని ఓ భారీ స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దనున్నారు. ఇందులో ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ అరేనా, అథ్లెటిక్స్ ట్రాక్ వంటి అత్యాధునికి సదుపాయాలు ఉండబోతున్నాయి.

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. 11 మంది దుర్మరణం
గతేడాది ఆర్సీబీ మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న తరుణంలో చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా కమిషన్.. కేవలం ఎకరాల్లో నిర్మించి, 32 వేల మంది సామర్థ్యం మాత్రమే ఉన్న చిన్నస్వామి స్టేడియం ఇలాంటి భారీ ఈవెంట్లకు ఏ మాత్రం సురక్షితం కాదని తేల్చింది. పెద్ద మ్యాచ్లను ఇక్కడ నిర్వహించకూడదని సిఫార్సు చేసింది. ఈ ప్రమాదం కారణంగా గతేడాది చిన్నస్వామి స్టేడియం మహిళ వన్డే ప్రపంచ కప్, పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల హోస్టింగ్ హక్కులను కూడా కోల్పోయింది.
బెంగళూరు నుంచి తరలిపోయిన ఐపీఎల్ 2026 ఫైనల్
చిన్నస్వామి స్టేడియం కేవలం భద్రతా లోపాలే కాకుండా రాజకీయ వివాదాలకు కూడా కేంద్రంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇక్కడ కేవలం 5 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. మిగిలిన 2 మ్యాచ్లు రాయ్పూర్కు తరలించారు. గత ఏప్రిల్లో కర్ణాటక ప్రభుత్వ ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలు) స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్కూ తమకు ప్రత్యేకంగా టికెట్లు కేటాయించాలని పట్టుబట్టారు. ఈ టికెట్ల కేటాయింపు వివాదం తీవ్రమవడంతో, విసిగిపోయిన బీసీసీఐ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చేసింది. ఈ పరిణామాలన్నీ కర్ణాటక ప్రభుత్వం కొత్త స్టేడియం వైపు అడుగులు వేగంగా వేయడానికి కారణమయ్యాయి.
ప్రజాధనం వాడకుండా రూ.943 కోట్ల పెట్టుబడి
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ కొత్త స్టేడియం నిర్మాణానికి పన్ను చెల్లింపుదారుల సొమ్మును నేరుగా ఉపయోగించడం లేదన స్పష్టం చేశారు. కర్ణాటక హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలను వేలం వేయడం ద్వారా దాదాపు రూ. 20,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందులోని రూ. 943 కోట్లను ఈ స్టేడియం కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల అనేకల్ ప్రాంతంలో పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇప్పటికే చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.
పర్యావరణ వేత్తల అభ్యంతరాలు.. కోర్టులో కేసు
కొత్త స్టేడియం ప్రాజెక్టుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ.. పర్యావరణ పరంగా కొన్ని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టేడియం నిర్మిస్తున్న ప్రాంతం బన్నేరుఘట్ట నేషనల్ పార్క్, కరడికల్-మహాదేశ్వర వన్యప్రాణి కారిడార్కు చాలా దగ్గరగా ఉంది. ఇది పర్యావరణ సున్నిత ప్రాంతం కావడంతో, స్టేడియంలో ఉపయోగించే భారీ ఫ్లడ్లైట్లు, ప్రేక్షకుల శబ్దాలు, వాహనాల కాలుష్యం వల్ల అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు, స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉంది. ఏదేమైనా రాబోయే కొన్ని సంవత్సరాలలో (2029 నాటికి) ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే.. ఆర్సీబీకి ఇది కొత్త అడ్డాగా మారడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications