హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా వరుసగా విజయాలను సాధించింది. ఈ రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించడంలో టీమిండియా ఓపెనర్ రహానే కీలకపాత్ర పోషించాడు.

వర్షం కారణంగా రద్దు అయిన తొలి వన్డేలో 62 పరుగులు చేసిన రహానే, రెండో వన్డేలో 102 పరుగులతో సెంచరీ చేశాడు. ఇక శుక్రవారం జరిగిన మూడో వన్డేలో సైతం 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించిన తర్వాత రహానే మీడియాతో మాట్లాడాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో నేను ఆడలేకపోయాను. ఆ సమయంలో నేను నా ఫిట్నెస్పై, బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టా. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని వెస్టిండీస్ చేరుకోగానే నాలో పరుగుల దాహం మొదలైంది. నా ఆకలి తీరాంటే మెరుగైన ప్రదర్శన చేయాలనుకున్నా. విండీస్, ఇంగ్లాండ్లో నెట్స్ సెషన్స్లో పాల్గొనేవాడిని. బ్యాటింగ్ చేసేవాడిని. నా పరుగుల దాహం తీర్చుకోవడానికి విండీస్ పర్యటనలో ఓపెనర్గా అవకాశం ఇచ్చారు' అని రహానే అన్నాడు.
విండిస్ పర్యటనలో తన ఆటతీరుపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు. టాపార్డర్లో ఆడే అవకాశాన్ని కల్పించి తన నిలకడైన ఆటకు కారణమైన కెప్టెన్ కోహ్లి, జట్టు మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలిపాడు.
జులై నెలలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తే మీ బ్యాటింగ ఆర్డర్ మారుతుంది కాదా? అని అడిగిన ప్రశ్నకు రహానే సమాధానమిచ్చాడు. క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్ అని, ఏ స్ధానంలో బ్యాటింగ్కు దిగిన వంద శాతం న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ తాను సిద్ధమేనని చెప్పాడు.
శుక్రవారం జరిగిన మూడో వన్డేలో వెస్టిండిస్పై టీమిండియా 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్మన్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.
విండీస్ ఆటగాళ్లలో మొహమ్మద్ (40) పరుగులతో టాస్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత పావెల్(30), షాయ్ హోప్(23), హోప్(19)లు మినహా ఎవరూ రెండెంకల పరుగులు చేయలేదు. భారత స్పిన్నర్లు అశ్విన్(3/28), కుల్దీప్ యాదవ్(3/41)లు అద్భుత ప్రదర్శన చేశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), రహానేల(71) అర్ధ సెంచరీలతో రాణించగా కేదార్ జాదవ్(40), యువరాజ్(39) పరుగులు చేశారు.