
ఇంగ్లాండ్ మీద ఇటీవల టీ20 సిరీస్ గెలిచిన ఇండియా జట్టులో బౌలింగ్ విభాగం చాలా పటిష్ఠంగా కన్పించింది. ముఖ్యంగా పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. ఇంగ్లాండ్ టాపార్డర్ను వణికించాడు. ఇరువైపులా స్వింగ్ చేస్తూ భువీ చెలరేగుతుంటే క్రీజులో ఇంగ్లాండ్ స్పెషలిస్టు బ్యాటర్లు అయిన జాసన్ రాయ్, జాస్ బట్లర్ తోకముడిచారు. ఇక ఈ సిరీస్లో రెండు మ్యాచుల్లో 4వికెట్లు తీసిన భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక భువీ బౌలింగ్కు కామెంటర్లు, విశ్లేషకులు కూడా ఫిదా అయ్యారు.
ఇక అతన్ని టెస్టుల్లోకి కూడా తీసుకోవాలని కొందరు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అయితే టీ20 సిరీస్ ఆడిన భువీని.. వన్డేకు తీసుకోవాల్సిందంటూ సర్వత్రా కామెంట్లొస్తున్నాయి. ఇంగ్లాండ్ లాంటి పిచ్లలో స్వింగ్ కింగ్ అయిన భువీని ఆడిస్తే.. మ్యాచ్ టర్న్ చేయగలడని అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం టీ20లకు మాత్రమే టీమిండియా మేనేజ్మెంట్ భువీని పరిమితం చేసింది. అనుభవం, నైపుణ్యం కలగలిసిన సీనియర్ పేసర్ అయిన భువీని వన్డేలకు ఎంపిక చేయాల్సిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇటీవల భువీ టీ20 సిరీస్ అనంతరం స్పందిస్తూ.. 'నేను ఎప్పుడూ నా కెరీర్ ముగిసిపోతుందని అనుకోలేదు. అయితే ఆటకు దూరమైనప్పుడు కాస్త ఆత్మవిశ్వాసం కోల్పోయాను. కాస్త నిరాశకు కూడా గురయ్యాను. కానీ తప్పుకుండా తిరిగి రావాలనుకున్నా. మళ్లీ దేశం కోసం ఆడాలని సన్నద్ధమయ్యా. నిజాయితీగా నేను ఈ టైంలో ఇక దేని గురించి ఆలోచించడం లేదు.. నాకు ఎలాంటి అవకాశాలు లభించినా అందులో నేను బాగా రాణించడానికి ప్రయత్నించాలి.
అది టెస్ట్ అయినా వన్డే, టీ20లు అయినా నాకు అవకాశమొస్తే అందులో రాణించేందుకు చూస్తాను. టెస్ట్ జట్టులో చోటు దక్కితే నేనయితే వద్దు అని చెప్పను. కచ్చితంగా ఆడతాను. కానీ ఎంపిక అవ్వడం కాకపోవడాన్ని నేను డిసైడ్ చేయలేను. అందుకే ఆ విషయం గురించి ఆలోచించట్లేదు' అని భువనేశ్వర్ చెప్పాడు.