పీఎస్ఎల్ 2021 వాయిదా
ఫిబ్రవరి 20న ఆరంభమైన పీఎస్ఎల్ 2021 మార్చి 22 వరకు కొనసాగాల్సింది. తాజా నిర్ణయంతో లీగ్లో మిగిలిన మ్యాచ్లతో పాటు క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టోర్నీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పీసీబీ.. ఆటగాళ్లకు వైరస్ పరీక్షలు చేపట్టనున్నది. ఆరు ఫ్రాంచైజీలకు చెందిన ప్లేయర్లకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. పాజిటివ్గా తేలిన ఆటగాళ్లను ఐసోలేషన్లోకి పంపనున్నారు. పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
పోయి ఇంట్లో కూర్చో
పీఎస్ఎల్ 2021 వాయిదా పడడంతో ఐపీఎల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్నారు. 'స్టెయిన్.. పీఎస్ఎల్ వాయిదా పడింది. ఇక సంవత్సరం పాటు ఇంట్లో కూర్చో. నీ స్నేహితులు ఐపీఎల్ ఆడుతుంటే చూస్తూ ఆనందించు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కోవిడ్ రివార్డ్ బాగుందా.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ బాగా ఇచ్చింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'అవును డేల్.. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏ విధంగా ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎక్కువ రివార్డింగ్ ఇచ్చిందో', 'డేల్.. బాగా అయింది' అంటూ కెమెంట్ల వర్షం కురిపిసున్నారు.
నన్ను క్షమించండి
ఐపీఎల్లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అసలు ఆటకు విలువ లేదని స్టెయిన్ తాజాగా అన్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్, శ్రీలంక ప్రిమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే స్టెయిన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో బుధవారం తనపై వస్తున్న విమర్శలపై దక్షిణాఫ్రికా పేసర్ స్పందించాడు. 'నా వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏ లీగ్లను కించపరచడం, అవమానించడం లేదా పోల్చడం చేయలేదు. నా వ్యాఖ్యలను సోషల్ మీడియా తప్పుగా రాసుకొచ్చింది. ఐపీఎల్ను చులకన చేసి మాట్లాడి ఉంటే క్షమించండి' అని అన్నాడు.
పీఎస్ఎల్ 2020 కూడా వాయిదానే
గత ఏడాది కూడా పీఎస్ఎల్ ప్రారంభమై కరోనా కేసులతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్కు కరోనా లక్షణాలు కనిపించడంతో టోర్నీని వాయిదా వేశారు. హేల్స్తో పాటు మరికొందరికి లక్షణాలు బయటపడ్డాయి. ఇంకొందరికి మాత్రం వైరస్ సోకింది. మిగిలిన ప్లే ఆఫ్ మ్యాచ్లతో పాటు ఫైనల్ మ్యాచ్ను నవంబర్ 2020లో నిర్వహించారు. అప్పుడు సజావుగానే జరగగా.. ప్రస్తుతం మరోసారి కరోనా కలకలం రేపింది.