
హైదరాబాద్: వన్డే ప్రమాణాలను నేపాల్ జట్టు నీరుగార్చదని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. గతవారం నేపాల్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడేందుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ నుంచి వన్డే హోదా పొందిన నేపాల్ క్రికెట్ జట్టుకు ధోని అభినందనలు తెలిపాడు.
బిజినెస్ ట్రిప్లో భాగంగా లక్నోలో పర్యటంచిన ధోని నేపాల్కు వన్డే హోదా ఇవ్వడంపై మాట్లాడుతూ 'కొన్నేళ్ల క్రితం నేపాల్ను సందర్శించిన సమయంలో అక్కడి క్రికెటర్లను కలిశాను. వాళ్లు చాలా కష్టపడటాన్ని గమనించాను' అని ధోని పేర్కొన్నాడు.
'క్రికెట్ పట్ల వారి కఠిన సాధన, ఆటపై నిబద్ధతకు ఫలితమే ఈ వన్డే హోదా. చిన్న చిన్న జట్లు భాగస్వామ్యం కావడం వల్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలు తగ్గుతాయని నేను అనుకోవడం లేదు. క్రికెట్ను గ్లోబల్ క్రీడగా తయారు చేయాలంటే ఇలాంటి టీమ్లు మరెన్నో భాగస్వామ్యం కావాలి' అని ధోని తెలిపాడు.
'క్రికెట్ ఆడే అసోసియేట్ దేశాలు ఐసీసీ వన్డే హోదా దక్కించుకునేందుకు ప్రయత్నించడం మంచి పరిణామం. అంతర్జాతీయ టీమ్గా ఎదిగిన అఫ్గనిస్థాన్ క్రికెట్ టీమ్ ఇందుకు ఉదాహరణ' అని ధోనీ వివరించాడు. జింబాబ్వే లోని హారారే వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పపువా న్యూగునియాపై నేపాల్ అద్భుత ప్రదర్శన చేసింది.
ఈ అద్భుత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని నేపాల్కు ఐసీసీ వన్డే హోదా కల్పించింది. నాలుగేళ్లపాటు నేపాల్కు ఈ తాత్కాలిక వన్డే హోదా ఉంటుంది.