
హైదరాబాద్: ఐసీసీ హోదా దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడిన నేపాల్కు సత్ఫలితమే వచ్చింది. ఈ హోదాను దక్కించుకున్న నాలుగు దేశాల్లో ఆఖరుగా స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఇటీవలే నేపాల్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడేందుకు అర్హత సాధించినట్లైంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్లలో నేపాల్ జట్టు అసాధారణ ప్రదర్శన చేసి చూపింది. ఈ సమరంలో పపువా న్యూ గునియాను వెనక్కినెట్టి వన్డే హోదా దక్కించుకుంది.
దీంతో అసోసియేట్ దేశాలతో ఐసీసీ డివిజన్ లీగ్లు ఆడుతూ వచ్చిన నేపాల్ ఇకపై అంతర్జాతీయ వన్డేలు ఆడనుంది. టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాలకు ఐసీసీ శాశ్వత వన్డే హోదా లభించనుంది. వీటితో పాటుగా మరో నాలుగు జట్లకు ఐసీసీ తాత్కాలిక హోదా కల్పిస్తుంది. నాలుగేళ్ల పాటు కొనసాగనున్న తాత్కాలిక హోదానే నేపాల్ సైతం తాజాగా పొందింది. ఇదే నేపథ్యంలో మొన్నటి వరకు కొనసాగిన పపువా న్యూ గినియా తాజా ఓటిమితో కోల్పోయింది.
2022 వరకు అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఆ జట్టుకు అవకాశం లభించింది. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో సూపర్ సిక్స్కు అర్హత సాధించకపోయినప్పటికీ.. ఐసీసీ వన్డే హోదాకు కావాల్సిన విజయాన్ని నేపాల్ సాధించింది. గురువారం 6 వికెట్ల తేడాతో పపువా న్యూ గునియాను ఓడించింది. మిగిలిన ఏకైక హోదా స్థానాన్ని సొంతం చేసుకుంది.
విండీస్కు అఫ్గాన్ షాక్
ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో అఫ్గానిస్థాన్ తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. గురువారం కీలక మ్యాచ్లో ఆ జట్టు వెస్టిండీస్కు షాకిచ్చింది. మాజీ ప్రపంచ ఛాంపియన్ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట విండీస్ను అఫ్గాన్ 197/8కు కట్టడి చేసింది. లక్ష్యాన్ని అఫ్గాన్ 47.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రహ్మద్ షా (68), మహ్మద్ నబి (31) ఛేదనలో కీలక పాత్ర పోషించారు.