లక్నో: సందర్భాన్ని బట్టి ఫన్ కౌంటర్స్.. పంచ్ డైలాగ్స్తో ఎన్కౌంటర్స్.. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్స్ చేసే శైలి ఇది. వీరూ నుంచి ట్వీట్ వచ్చిందంటే ట్విట్టర్ మోత మోగాల్సిందే అన్నట్లు ఉంటుంది పరిస్థితి.
అయితే ఓ ట్వీట్ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో సెహ్వాగ్ నెటిజెన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు విషయాన్ని కప్పి పుచ్చి తప్పుడు సమాచారమిచ్చేలా ట్వీట్ చేశావని నెటిజెన్స్ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.
గోరఖ్ పూర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలపై సెహ్వాగ్ ట్వీట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. 1978లో తొలిసారి మెదడువాపు వ్యాధి వచ్చిందని పేర్కొన్న సెహ్వాగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికిపైగా చిన్నారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కూడా అదే ఏడాది అంటే 1978లో జన్మించానని పేర్కొన్నాడు.
కాగా, చిన్నారులు ఆక్సిజన్ అందక చనిపోతుంటే.. ఇలా వ్యాధితో చనిపోయారని సెహ్వాగ్ ట్వీట్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.పిల్లల మృతికి కారణమైన ప్రభుత్వం గురించి ఒక్క మాటైనా సెహ్వాగ్ మాట్లాడలేదని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యానికి బలి:
మరో నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైపోయిందంటూ ఆదివారం సెహ్వాగ్ మరో ట్వీట్ కూడా చేశారు. ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా 25ఏళ్ల విశాల్ కుమార్ వర్మ ఓ జాతీయ స్థాయి రెజ్లర్ దుర్మరణం చెందడం పట్ల వీరూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విశాల్ కుమార్ వర్మ ఎలక్ట్రిక్ షాక్ తో దుర్మరణం చెందాడు. స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన అతనికి.. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది గుర్తించి అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచిపోయాడు.