Neeraj Chopra: మే నెలలో బెంగళూరు వేదికగా ఎన్సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ జరగనుంది. పహల్గాం ఘటన నేపథ్యంలో ఈ ఈవెంట్ కు పాకిస్థాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్ను భారత్కు ఆహ్వానించడంపై విమర్శలు ఎదుర్కొంటోన్న భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా స్పందించాడు. తాను ఎందుకు అతడిని ఆహ్వానించాడో వివరించాడు. తన కుటుంబం పై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అది ముందే జరిగింది..
"నేను సాధారణంగా ఎక్కువగా మాట్లాడని వాడిని, కానీ నాకు తప్పుగా అనిపించిన దానిపై మాట్లాడకుండా ఉండను. ముఖ్యంగా దేశంపై నా ప్రేమ, చిత్తశుద్ధితో పాటు నా కుటుంబ గౌరవం, ప్రతిష్టను ప్రశ్నించినప్పుడు అయితే అసలు మాట్లాడకుండా ఉండలేను. నేను ఈ నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్కు అర్షద్ నదీమ్ను ఆహ్వానించడంపై పెద్ద చర్చే జరుగుతోంది. చాలా మంది రకారకాలుగా నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో చాలా వరకు అసభ్యకరంగా ఉన్నాయి. వారు నా కుటుంబాన్ని కూడా వదల్లేదు. నేను ఓ అథ్లెట్ గా మరో అథ్లెట్ ను ఆహ్వానించాను. అంతే తప్పా మరేమీ లేదు. ఎన్సీ క్లాసిక్ లక్ష్యం అత్యుత్తమ అథ్లెట్లను భారత్కు రప్పిండమే. వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్ ఈవెంట్స్ ను నిర్వహించగలమని చెప్పడమే. ఇతర దేశ అథ్లెట్లను పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ముందే ఆహ్వానించడం జరిగింది."

అదే నా మొదటి ప్రాధాన్యత..
"ఆ తర్వాత 48 గంటల్లో ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పుడు అర్షద్ ఎన్సీ క్లాసిక్కు హాజరుకావడమనే ఆలోచన అసంభవం. నా దేశ ప్రయోజనమే నా మొదటి ప్రాధాన్యత. ఈ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న నా దేశ ప్రజల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తాను. పహల్గాం దాడి విషయంలో నాకు బాధతోపాటు కోపం కూడా ఉంది. నేనెప్పుడు భారత్ గర్వపడేలానే కష్టపడ్డాను. సరైన కారణాలతో విమర్శలు చేస్తే గౌరవంగా ఉంటుంది." అని నీరజ్ బాధను వ్యక్తం చేశాడు.