అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ ఆడేందుకు భారత మహిళల జట్టు సిద్ధం అవుతోంది. ఇంగ్లండ్తో తుది పోరులో ఈ జట్టు పోరాడనుంది. ఈ ట్రోఫీ గెలిస్తే.. భారత మహిళల జట్టు గెలిచే తొలి ప్రధాన ఐసీసీ టోర్నీ ఇదే అవుతుంది. షెఫాలీ వర్మ సారధ్యంలోని భారత జట్టు ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లో భారత్ నెగ్గింది.
అదే జోరులో ఫైనల్ కూడా గెలిచి కప్పు సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఆ జట్టుకు సర్ప్రైజ్ ఇచ్చాడు. మహిళల జట్టును ప్రత్యేకంగా కలిసిన నీరజ్.. వారితో ముచ్చటించాడు. ఫైనల్ ముందు భారత మహిళల జట్టుకు మోటివేషన్ అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.
'గోల్డెన్ స్టాండర్డ్ మీటింగ్.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ ముందు జావెలిన్ త్రోవర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. భారత జట్టుతో ముచ్చటించాడు' అని ఆ ఫొటోలకు క్యాప్షన్ జత చేసింది.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ షెఫాలీ వర్మ కూడా జట్టుతో తన సందేశాన్ని పంచుకుంది. దీనిపై మాట్లాడిన ఆమె.. ఇది ఫైనల్ అనే ఒత్తిడి తెచ్చుకోకుండా ఆడాలని తను జట్టుకు సూచించానని వెల్లడించింది. లేదంటే ఆ ఒత్తిడి మన ఆటతీరుపై పడుతుందని వివరించింది. ఇది కూడా మరో మ్యాచ్ అనే ఆలోచనతోనే మైదానంలో దిగాలని, కానీ నూటికి నూరు శాతం సత్తా చాటాలని జట్టుకు తెలిపినట్లు వెల్లడించింది. తను ఇంతకుముందు కూడా వరల్డ్ కప్లు ఆడిన అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.