World Athletics Championship: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగనున్నారు. గతంలో టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా.. అదే మైదానంలో ఇప్పుడు తన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. నీరజ్ చోప్రాతో పాటు భారత్ నుంచి సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా ఈ జావెలిన్ త్రో ఈవెంట్లో పాల్గొంటున్నారు.
క్వాలిఫికేషన్ రౌండ్ వివరాలు ఇలా..
నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ జరుగుతుంది. ఇందులో మొత్తం 37 మంది అథ్లెట్లు పాల్గొంటారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 'ఏ'లో 19 మంది, గ్రూప్ 'బీ'లో 18 మంది ఉన్నారు. గ్రూప్ ఏలో నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్ ఉండగా.. గ్రూప్ బీలో రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ ఉన్నారు. క్వాలిఫికేషన్ రౌండ్లో 84.50 మీటర్లు త్రో చేసిన అథ్లెట్ నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఎవరూ ఈ మార్కును చేరుకోకపోతే, అత్యుత్తమ త్రో చేసిన 12 మంది ఫైనల్కు అర్హత పొందుతారు.

పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా..
పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కూడా ఈ ఛాంపియన్ షిప్లో పోటీ పడుతున్నాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో 92. 97 మీటర్ల త్రో చేసి ఒలింపిక్ రికార్డుతో గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆయన ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో 86.40 మీటర్ల త్రోతో గోల్డ్ సాధించారు.
ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..
నీరజ్ చోప్రా ఈవెంట్ (క్వాలిఫికేషన్ రౌండ్): గ్రూప్ 'ఏ' పోటీలు భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 3:40 గంటలకు మొదలవుతాయి. గ్రూప్ 'బి' పోటీలు సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమవుతాయి. జావెలిన్ త్రో పురుషుల ఫైనల్ గురువారం (సెప్టెంబర్ 18) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:53 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్ను భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో సినిమా యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.