Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి వల్ల భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్యపరంగా, అలానే క్రీడల విషయంలోనూ దాయాది దేశంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉండేలా భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బీసీసీఐ.. ఆ దేశంలో భవిష్యత్ లోనూ ఎప్పటికీ క్రికెట్ ఆడేది లేదని స్పష్టం చేసింది. అలానే పీఎస్ఎల్ 2025 ఇక్కడ ప్రసారం కాకుండా నిలిపివేశారు. ఇంకా జావెలిన్ త్రో ఈవెంట్ విషయంలోనూ రీసెంట్ గానే పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ భారత్కు రాకుండా చర్యలు తీసుకున్నారు!
ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోవాలని పాక్ జాతీయులకు భారత ప్రభుత్వం ఆంక్షలు, గడువు కూడా విధించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 780 మందికి పైగా దేశం విడిచి వెళ్లిపోయారని తెలిసింది. ఇంకా పాకిస్థాన్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, ఇతర సోషల్ మీడియా ఖాతాలను మన దేశంలో బ్లాక్ చేస్తోంది. ఆ దేశ యూట్యూబర్ హనియా ఆమిర్తో పాటు పలువురు క్రీడాకారుల సోషల్ మీడియా ఖాతాలను కూా బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో పాకిస్థాన్ క్రీడాకారుడి ఖాతాపై కూడా భారత్ చర్యలు చేపట్టింది. అతడే పాకిస్థాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్. అర్షద్ ఇన్ స్టా ఖాతాను భారత్లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.

కాగా, ప్యారిస్ ఒలింపిక్స్ లో అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దర మధ్య ప్రొఫెషనల్ పరంగా మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే రీసెంట్ గా.. మే నెలలో బెంగళూరు వేదికగా జరగబోయే ఎన్సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ కు అర్షద్ ను ఆహ్వానించాడు నీరజ్. కానీ పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో భారత్ తీసుకుంటోన్న చర్యల వల్ల అర్షద్ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. పైగా అతడిని ఆహ్వానించే విషయమై నీరజ్ చోప్రాపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. కానీ చోప్రా.. ప్రొఫెషనల్ పరంగానే అర్షద్ ను పిలిచినట్లు, అంతకుమించి ఏమీ లేదని వివరణ ఇచ్చాడు.