
హైదరాబాద్: అమెరికాలో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో బాస్కెట్బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రియాంట్ దుర్మరణం చెందడంపై ఒక్కసారిగా క్రీడాలోకం షాక్కు గురైంది. ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్ మరణించారు.
కొబ్ బ్రయాంట్తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానా కూడా దుర్మరణం చెందింది. కొబ్ బ్రయంట్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు అతడి మృతికి సంతాపం తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతి వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో "ఈ వార్త వినడం దురదృష్టకరం. ఇది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితం అనేది ఊహించలేనిది. ఆ ప్రమాదంలో బ్రియాంట్తో పాటు అతని కుమార్తె కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. వారి ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నా" అని కామెంట్ పెట్టాడు.
View this post on InstagramA post shared by Virat Kohli (@virat.kohli) on
ఇక, రోహిత్ శర్మ సైతం తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో "ఇది క్రీడా ప్రపంచం మొత్తానికి దుర్దినం. ఒక దిగ్గజాన్ని క్రీడాలోకం కోల్పోయింది. బ్రియాంట్, అతని కుమార్తె గియానా ఆత్మకు శాంతి చేకూరాలి" అని తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం... ఆదివారం కొబ్ బ్రయంట్, ఆయన కూతురు జియానా, మరో ఏడుగురు సికోర్స్కీ ఎస్ -76 హెలీకాప్టర్లో ప్రయాణించారు.
దట్టమైన మేఘాల కారణంగా హెలికాప్టర్ లాస్ఏంజిల్స్ పశ్చిమ కాలాబాసాస్లోలోని కొండపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న 9 మందితో సహా విమాన సిబ్బంది కూడా మరణించారు. కొబ్ బ్రయంట్, ఆయన కూతురు జియానాను అధికారులు గుర్తించగా.. పైలట్ మరియు మరో ఆరుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి.
బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు సైతం విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు.