
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఈ నెల 18న చెన్నైలో నిర్వహించనున్న మినీ వేలం కోసం క్రికెటర్ల జాబితాను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. మొత్తంగా 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఇందులో 292 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 13, సన్రైజర్స్ హైదరాబాద్లో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
మినీ వేలం కోసం బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం వీరిలో కుర్రాళ్ల నుంచి సీనియర్ ఆటగాళ్లవరకూ అందరూ ఉన్నారు. అయితే ఈ జాబితాలో అతిపిన్న వయసు ఆటగాడు ఎవరో తెలుసా?. అతను మరెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన నూర్ అహ్మద్. ఇతడి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్గా ఇటీవలలి బిగ్ బాష్ లీగ్లో సత్తాచాటాడు. గతేడాది చోటు దక్కించుకోని నూర్.. ఈసారి భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. పంజాబ్, ముంబై, ఢిల్లీ ప్రాంఛైజీలు మనోడిపై కన్నేసినట్టు సమాచారం.
ఇక ఐపీఎల్ 2021 వేలంలో ఉన్న అత్యంత వయసైన ఆటగాడు నయన్ దోషి. ఈయన వయసు 42 సంవత్సరాలు. భారత మాజీ క్రికెటర్ దిలిప్ దోషి కుమారుడే ఈ నయన్. నయన్ రాజస్థాన్ రాయల్స్ (2010), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2011) తరఫున ఇదివరకు ఆడాడు. నయన్ నాలుగు ఐపీఎల్ మ్యాచ్లలో 8.46 ఎకానమీ రేటుతో రెండు వికెట్లు పడగొట్టాడు. విశేషమేమిటంటే దోషి 2013-14 నుంచి పోటీ క్రికెట్ ఆడలేదు. 2021 వేలంలో ఏ ప్రాంచైజీ ఆయినా ఇతగాడిని కొంటే.. దశాబ్దం తరువాత లీగ్లో ఆడనున్నాడు. మరి దోషిని ఏ ఫ్రాంచైజీ చేజిక్కించుకుంటుందో చూడాలి.
భారత్ నుంచి హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ మాత్రమే రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. అలాగే మరో ఎనిమిది విదేశీ క్రికెటర్లను సైతం రూ.2కోట్ల బేస్ప్రైస్ జాబితాలో చేర్చారు. ఇందులో గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు. రూ.1.5 బేస్ప్రైజ్ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్యాదవ్ సహా 11 మందిని చేర్చారు. మరోవైపు బోర్డు ప్రకటనలో వివో ఐపీఎల్-2021 అని ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది లీగ్కు మళ్లీ చైనా మొబైల్ కంపెనీ వివోనే స్పాన్సర్గా ఉండనున్నట్లు తెలుస్తోంది.