Navjot Singh Sidhu: టీమిండియా మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి చర్చల్లో నిలిచారు. సిద్దూతో ముడిపెట్టి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఆయనకు ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎక్స్(ట్విట్టర్ వేదికగా ఓ యూజర్.. సిద్దూ గురించి ఓ సంచలన విషయాన్ని పేర్కొన్నాడు. అదేమిటంటే.. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లను బీసీసీఐ నుంచి తొలగించాలని సిద్దూ డిమాండ్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది.
వైరల్ పోస్ట్లో ఏముంది?
ఆ వైరల్ పోస్ట్లో ఇలా రాసి ఉంది:"టీమిండియా 2027 వన్డే ప్రపంచ కప్ను గెలవాలంటే, బీసీసీఐ వెంటనే గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లను తొలగించాలి. రోహిత్ శర్మకు మరోసారి పూర్తి గౌరవంతో కెప్టెన్సీని అప్పగించాలి." ఇలాంటి డిమాండ్ చేసినట్లు సిద్ధూ పేరుతో ఆ పోస్ట్లో పేర్కొన్నారు. అయితే సిద్ధూ ఈ విషయం ఎక్కడ, ఎవరితో చెప్పారనే దానిపై ఎలాంటి సమాచారం అందులో లేదు.

నవజోత్ సింగ్ సిద్ధూ స్పందన
ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయిన తర్వాత మాజీ క్రికెటర్ సిద్ధూ వెంటనే స్పందించారు. ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "నేను ఈ మాట ఎప్పుడూ అనలేదు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయకండి, నేను ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మీకు సిగ్గుండాలి." అని పేర్కొన్నారు. ఈ విధంగా నవజోత్ సింగ్ సిద్ధూ పేరును ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయని స్పష్టమైంది. ఈ వదంతులు గనుక నిజమైతే, అది పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం ఉండేది.
గంభీర్, అగార్కర్లపై పెరుగుతున్న ప్రశ్నలు
గత కొంతకాలంగా గౌతమ్ గంభీర్ (హెడ్ కోచ్), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాత్రలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ అప్పగించడం కూడా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీమిండియాను సిద్ధం చేయడానికి గంభీర్, అగార్కర్ మార్పుల ప్రక్రియను ప్రారంభించారని తెలుస్తోంది.