టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్లో రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ.. విజయ్ హజారే ట్రోఫీలోనూ ఢిల్లీ తరఫున ఒక సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే విరాట్ కోహ్లీ 2025 మే నెలలో టెస్ట్ క్రికెట్కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి తిరిగి రావాలని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆకాంక్షించారు. కోహ్లీని '24 క్యారెట్ల బంగారం'తో పోలుస్తూ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిద్ధూ మనసులోని మాట
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇన్స్టాగ్రామ్ వేదికగా కింగ్ కోహ్లీ గురించి గొప్పగా రాసుకొచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా దేవుడు తనకు ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటానో ఆయన వివరించారు."భగవంతుడు నాకు ఒక వరం ఇస్తే.. విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసి మళ్లీ టెస్టు క్రికెట్ ఆడేలా చేయమని అడుగుతాను. 150 కోట్ల జనాభా గల దేశానికి దీనికంటే గొప్ప సంతోషం ఏముంటుంది? కోహ్లీ ఫిట్నెస్ 20 ఏళ్ల కుర్రాడిలా ఉంటుంది. అతడు స్వచ్ఛమైన '24 క్యారెట్ల బంగారం' లాంటివాడు." అని సిద్ధూ పేర్కొన్నారు.

టెస్టుల్లో కోహ్లీ లేని లోటు
ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ 0-2తో ఘోర పరాజయం పాలైంది. కష్టకాలంలో జట్టును ఆదుకునే విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్ లేకపోవడం జట్టుపై స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానులు కూడా విరాట్ కోహ్లీని తిరిగి టెస్టుల్లోకి రావాలని కోరుతున్నప్పటికీ, తాను ఇకపై భారత్ తరఫున కేవలం ఒక్క ఫార్మాట్ (వన్డే) మాత్రమే ఆడతానని కోహ్లీ స్పష్టం చేశారు.
కోహ్లీ - ఒక లెజెండరీ కెప్టెన్
టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ సారథ్యంలో భారత్ 40 టెస్టుల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. స్వదేశంలో కోహ్లీ కెప్టెన్సీలో భారత్ కేవలం రెండే రెండు టెస్టుల్లో ఓడిపోవడం విశేషం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ (WTC) సైకిల్లో భారత్ తన తదుపరి టెస్ట్ సిరీస్ను ఆగస్టు 2026లో శ్రీలంకతో ఆడనుంది. అప్పటికైనా కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమోనని సిద్ధూతో పాటు కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.