ఈ ఏడాది ఐపీఎల్లో ఎవరూ మర్చిపోలేని ఘటన ఆర్సీబీ, లక్నో మధ్య మ్యాచ్లో జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం జరిగింది. దీనిలో ఎల్ఎస్జీ మెంటార్ గౌతం గంభీర్ కూడా కలగజేసుకున్నాడు. దీంతో ఆ గొడవ చినికి చినికి గాలివానైంది. ఆ తర్వాత ఈ గొడవను ఫ్యాన్స్ మర్చిపోలేదు.
ముఖ్యంగా ఆర్సీబీని ఎగతాళి చేసేందుకు నవీన్ 'మ్యాంగోస్' పోస్టు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. అప్పటి నుంచి లక్నో ఆడే ప్రతి మ్యాచులో ఫ్యాన్స్ 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ నినాదాలు చేస్తూ నవీన్ను ఎగతాళి చేశారు. దీనిపై తాజాగా స్పందించిన నవీన్.. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

'మ్యాచ్ సమయంలో కోహ్లీ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ ఫైట్ మొదలు పెట్టలేదు. మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు కూడా విరాట్ కోహ్లీనే గొడవ పట్టాడు. మాపై పడిన ఫైన్స్ చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది' అని ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ గొడవను సీరియస్గా తీసుకున్న బీసీసీఐ.. కోహ్లీ, గంభీర్ ఇద్దరికీ 100 శాతం మ్యాచ్ ఫీజును ఫైన్ వేసింది. నవీన్కు 50 శాతమే వేసింది.
'నేను సాధారణంగా ఎవర్నీ స్లెడ్జ్ చేయను. ఒకవేళ చేసినా నేను బౌలింగ్ చేసేప్పుడు బ్యాటర్లను చేస్తా. ఎందుకంటే నేను బౌలర్ను కదా. ఆ మ్యాచ్లో కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు. ఎవర్నీ స్లెడ్జ్ చేయలేదు. అక్కడ ఉన్న వాళ్లందరికీ నేను ఈ సిచ్యుయేషన్ను ఎలా డీల్ చేశానో తెలుసు. బ్యాటింగ్ చేసేప్పుడు కానీ.. మ్యాచ్ తర్వాత కానీ నేను ఎక్కడా కోపం చూపించలేదు' అని నవీన్ తెలిపాడు.
'మ్యాచ్ తర్వాత నేను ఏం చేశానో అందరికీ కనిపిస్తుంది. షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు కోహ్లీనే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అయ్యా' అని చెప్పాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ తనను ఎగతాళి చేయడంపై మాట్లాడుతూ.. 'అది నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇక క్రిటిక్స్ నోళ్లు ఎలా మూయించాలో నాకు తెలుసు. ఇక 80 వేల మంది ప్రేక్షకులతో గొడవ పడాల్సిన అవసరం నాకు లేదు' అని నవీన్ అన్నాడు.
'నేను నా ఆటపైనే ఫోకస్ పెట్టా. నా నైపుణ్యాన్ని నమ్ముకున్నా. నా ఆటతోనే అందరికీ సమాధానం చెప్పాలని అనుకున్నా. అలాగే ఈ గొడవను సోషల్ మీడియాలోకి లాగాలని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అవతలి వాళ్లు సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగడం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. నేన ఎవరి పేరు ప్రస్తావించలేదు కదా. జస్ట్ నా మామిడికాయలు ఎంజాయ్ చేశానంతే' అని నవీన్ పేర్కొన్నాడు.