ఆందోళన వద్దు.. అంతా నేను చూసుకుంటానని పంత్ చెప్పాడు: సైనీ

ఢిల్లీ: గబ్బాలో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ విన్నింగ్ షాట్ను తాజాగా యువ పేసర్ నవదీప్ సైనీ గుర్తుచేసుకున్నాడు. 328 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6) చివరి వరకూ క్రీజులో నిలిచి మరో 19 బంతుల ఆట మిగిలి ఉండగానే టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బ్యాట్స్మెన్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్నా.. భారీ షాట్లు ఆడి సత్తాచాటాడు. అయితే పంత్తో జరిగిన సంభాషణను తాజాగా సైనీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

అంతా నేను చూసుకుంటానన్నాడు
ఓ జాతీయ మీడియాతో నవదీప్ సైనీ మాట్లాడుతూ... 'రిషబ్ పంత్తో కలిసి బ్యాటింగ్ చేయడం అదే మొదటిసారి. చాలా సరదాగా అనిపించింది. టీమిండియాని పంత్ గెలిపిస్తాడని తెలుసు. క్రీజులోకి వెళ్లిన తర్వాత నన్ను ఎలా ఆడమంటావ్? అని పంత్ని అడిగా. నేను పరుగు కోసం పిలిచినప్పుడు పరుగెత్తు చాలు అని సమాధానం ఇచ్చాడు. అలా అని రిస్క్ తీసుకోవద్దని చెప్పాడు. ఆ తర్వాత స్ట్రైకింగ్కి వెళ్లిన పంత్.. ఒక బంతి తర్వాత మళ్లీ పిచ్ మధ్యలోకి వచ్చి నన్ను పిలిచాడు. ఆందోళన అసలు పడకు.. అంతా నేను చూసుకుంటా అన్నాడు. ఆపై బౌండరీ బాదాడు' అని తెలిపాడు.

9వ స్థానంలో బ్యాటింగ్
318 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్, 325 రన్స్ వద్ద శార్ధూల్ ఠాకూర్ ఔటవడంతో.. 9వ స్థానంలో నవదీప్ సైనీ బ్యాటింగ్కి వచ్చాడు. భారత్ జట్టు విజయానికి 3 పరుగులు అవసరమైన సమయంల్లో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ విసిరిన బంతిని లాంగాఫ్ దిశగా బౌండరీ బాదిన రిషబ్ పంత్.. లాంఛనాన్ని పూర్తి చేశాడు. గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా టెస్టుల్లో ఓడని ఆస్ట్రేలియాకి.. రహానే సేన ఓటమి రుచి చూపింది. ఇక నాలుగు టెస్టుల సిరీస్ని 2-1తో కైవసం చేసుకుంది.

సైనీ గాయం విషయం మరచిపోయా
ఇటీవల స్పోర్ట్స్ టుడేలో బోరియా మజుందార్తో మాట్లాడిన రిషభ్ పంత్.. నవదీప్ సైనీ గాయంపై స్పదించాడు. 'నేను విన్నింగ్ షాట్ ఆడినప్పుడు.. బంతి బ్యాట్ చివరకు తగిలిందని భావించాను. అవుట్ ఫీల్డ్ కూడా నెమ్మదిగా ఉంది. అందుకే రెండు కాదు మూడు పరుగులు తీయాలని నాన్-స్ట్రైకర్ సైనీతో అన్నాను. సైనీ గాయం గురించి మర్చిపోయి వేగంగా పరుగెత్తా. మొదటి పరుగు పూర్తి చేశా. రెండో పరుగు తీస్తున్నప్పుడు.. మిడ్-ఆఫ్ ఫీల్డర్ బంతిని ఛేజ్ చేయలేడని అర్ధమైంది. బంతి బౌండరీ వెళ్లింది. ఆనందంలో మునిగిపోయా. అయితే ఆ సమయంలో సైనీ ఒక కాలితో పరుగెత్తుతున్నాడు. అప్పుడు గాయం విషయం గుర్తుకువచ్చింది. ఆ సమయంలో సరదాగా అనిపించింది' అని తెలిపాడు.

సైనీకి కష్టమే
ఆస్ట్రేలియాపై 2-1తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్జోష్లో ఉన్న భారత జట్టు మరో సమరానికి సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కూడా ఒక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్లో ఉన్నారు. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన పంత్కు తుది జట్టులో చోటు ఖాయం కాగా.. సైనీకి మాత్రం కష్టంగానే ఉంది. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రావడంతో సైనీకి అవకాశాలు తగ్గాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
India vs England: తొలి టెస్టుకి భారత జట్టు ఇదే.. సిరాజ్, శార్ధూల్, సైనీలకు దక్కని చోటు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications