
హైదరాబాద్: ఆర్టికల్ 2.5 నిబంధలను ఉల్లంఘించినందకు గాను టీమిండియా యువపేసర్ నవదీప్ సైనీపై ఐసీసీ చర్యలు తీసుకుంది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మొదటి రెండు టీ20లను భారత్-విండిస్ జట్లు ఫ్లోరిడా వేదికగా ఆడిన సంగతి తెలిసిందే.
అయితే, విండిస్తో జరిగిన తొలి టీ20లో నికోలస్ పూరన్ ఔటైనప్పుడు నవదీప్ సైనీ అతిగా సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన నవదీప్ సైనీ ఖాతాలో ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ని జత చేసింది. సైనీకి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
ఫీల్డ్ అంపైర్లు నిగెల్ డుగిడ్, జార్జ్ బ్రాత్వైట్, మూడో అంపైర్ లెస్లీ రీఫర్, నాలుగో అంపైర్ ప్యాట్రిక్ గస్టర్డ్ యువ పేసర్ నవదీప్ సైనీపై అభియోగాలు నమోదు చేశారు. మ్యాచ్ అనంతరం రిఫరీ జెఫ్ క్రో ముందు సైనీ తన తప్పుని అంగీకరించడంతో అతడి ఖాతాలో ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.
ఈ మేరకు తన ట్విట్టర్లో "ఐసీసీ ఆటగాళ్ల నిబంధన 2.5ను సైని ఉల్లంఘించినట్టు గుర్తించాం. బ్యాట్స్మన్ ఔటైనప్పుడు అతడు దూకుడుగా సైగలు చేస్తూ అతిగా సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జోడించాం' అని ఒక ప్రకటనలో పేర్కొంది.